Krishnam Raju : కృష్ణం రాజు మృతి బాధాకరం.. ఎమోషనల్ అయిన మోహన్ బాబు, కృష్ణ, పవన్ కళ్యాణ్, కళ్యాణ్ రామ్.!
టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ కృష్ణం రాజు మృతిని సినీలోకం జీర్ణించుకోలేకపోతోంది. ఉదయం నుంచి స్టార్స్ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మోహన్ బాబు, కృష్ణ, పవన్ కళ్యాణ్, తదితరులు నివాళి అర్పించారు.
టాలీవుడ్ సీనియర్ నటుడు కృష్ణం రాజు మృతి (Krishnam Raju Death)తో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన ఈ రోజు ఉదయం 3 గంటలకు పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న టాలీవుడ్ సినీ తారలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, బాలక్రిష్ణ, మహేష్ బుబు, ఎన్టీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తాజాగా పవన్ కళ్యాణ్, సీనియర్ నటులు మోహన్ బాబు, కృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ కూడా నివాళి అర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని, చేసిన సేవలను కొనియాడారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కృష్ణం రాజు మృతి పట్ల భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఎమోషనల్ నోట్ రాశారు. ‘శ్రీ కృష్ణంరాజు గారి మరణం దిగ్బ్రాంతికరం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక పంథాను కలిగిన నటులు శ్రీ కృష్ణంరాజు గారు. రౌద్ర రస ప్రధానమైన పాత్రలను ఎంతగా మెప్పించేవారో కరుణ రసంతో కూడిన పాత్రల్లోనూ అలాగే ఒదిగిపోయేవారు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలు పొందిన శ్రీ కృష్ణంరాజు గారు తుదిశ్వాస విడిచారనే వార్త దిగ్భ్రాంతి కలిగించింది. ఇటీవలి కాలంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారని తెలిసినప్పుడు కోలుకొంటారనే భావించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మా కుటుంబంతో కృష్ణంరాజు గారికి మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. 1978లో ‘మన వూరి పాండవులు’ చిత్రంలో అన్నయ్యతో కలిసి నటించారు. మొగల్తూరు గ్రామవాసులు కావడంతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. ‘భక్త కన్నప్ప’లో శ్రీ కృష్ణంరాజు గారి అభినయం ప్రత్యేకం. బొబ్బిలి బ్రహ్మన్న, అమరదీపం, తాండ్ర పాపారాయుడు, మహ్మద్ బిన్ తుగ్లక్, పల్నాటి పౌరుషం లాంటి చిత్రాలు ఆయన శైలి నటనను చూపాయి. ప్రజా జీవితంలోనూ ఆయన ఎంతో హుందాగా మెలిగారు. కేంద్ర మంత్రిగా సేవలందించారు. ప్రజారాజ్యంలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీ తరఫున బరిలో నిలిచారు. సినీ జీవితంలోనూ, ప్రజా జీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా వారు అందించిన సేవలు మరువలేనివి. శ్రీ కృష్ణంరాజు గారి కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.’ అంటూ ప్రకటన విడుదల చేశారు.
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు (Mohan Babu) కృష్ణంరాజు మరణవార్త తెలుకొని చింతించారు. ఆయన నోట మాటరాలేకపోయింది. దీంతో ట్వీటర్ వేదికన సంతాపం వ్యక్తం చేశారు. ‘కృష్ణంరాజు నా సోదరుడు. ఆయన లేకపోవడంతో నాకు మాటలు రావడం లేదు’ అంటూ భావోద్వేగంగా స్పందించారు. అలాగే సీనియర్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ (Krishna) కూడా ఎమోషనల్ అయ్యారు. కృష్ణంరాజు మరణవార్త తనను కలిచివేసిందంటూ వీడియో రూపంలో సంతాపం వ్యక్తం చేశారు. ‘కృష్ణంరాజును ఇంత తర్వగా కోల్పోవడం బాధాకరం. మా ఇద్దరి కేరీర్ ఒకే సారి ప్రారంభమైంది. ‘తేనే మనసులు’తో నేను, ‘చిలాకా గోరింక’ చిత్రంతో కృష్ణంరాజు నటులుగా ఇంట్రడ్యూస్ అయ్యాం. కృష్ణంరాజు హీరోగానూ మంచి ప్రతిభ చూపించారు. అంతేకాకుండా విలన్, ఆయా పాత్రలనూ పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన మరణానికి చింతిస్తూ.. కుటుంబ సభ్యులందరికీ సంతాపం వ్యక్తం చేస్తున్నానని అన్నారు.
అలాగే యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కూడా సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణంరాజు మరణవార్తకు చింతిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ప్రభాస్ మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను అని ట్వీట్ లో పేర్కొన్నారు. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyanram) కూడా దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. అదే విధంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తమ గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి, యూవీ క్రియేషన్స్ నుంచి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.