శివప్రసాద్ మరణం నన్ను కలిచివేసింది.. మోహన్ బాబు కామెంట్స్!
'నన్ను ఎప్పుడు పలకరించినా అన్న, అన్న అంటు ఎంతో ఆప్యాయంగా ఉండేవాడు. డాక్టర్ శివప్రసాద్ మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది' అంటూ నటుడు మోహన్బాబు ఎమోషనల్ ట్వీట్.
టీడీపీ మాజీ ఎంపీ డాక్టర్ శివప్రసాద్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మీడియా ముందు స్పందించగా.. మరికొందరు సోషల్ మీడియాలో ఆయనకి నివాళులు అర్పించారు.
తాజాగా సీనియర్ నటుడు, వైసీపీ నేత మంచు మోహన్ బాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. డా. శివ ప్రసాద్ తనకు దాదాపు నలభై ఏళ్ల నుండి తెలుసని అన్నారు.
1985-90లలో తను హీరోగా నటించిన 'భలే రాముడు' అనే సినిమాలో ఓ గెస్ట్ వేషంలో శివప్రసాద్ నటించారని.. అతను తనకు మంచి స్నేహితుడని.. నటుడని, నిర్మాత, రాజకీయవేత్త అంటూ ప్రసంశలు కురిపించాడు.
ఇటీవలే తనతో 'గాయత్రి' సినిమాలో కూడా నటించాడని.. ఎప్పుడు పలకరించినా అన్నా అంటూ ఎంతో ఆప్యాయంగా ఉండేవాడని చెప్పుకొచ్చాడు. శివప్రసాద్ మరణం తనను కలచివేసిందని.. అతనికి ఆత్మశాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.