సీనియర్‌ నటుడు మోహన్‌బాబు సంచలన ప్రకటన చేశారు. ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ని ఆయన ప్రకటించారు. వంద కోట్లతో సినిమా తీయబోతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి.

విలక్షణ నటుడు, కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు తాజాగా ఓ సంచలన విషయాన్ని వెల్లడించారు. వంద కోట్లతో సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. త్వరలో తాము వంద కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమాని నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఆ వివరాలు త్వరలో మంచు విష్ణు వెల్లడిస్తాడని తెలిపారు. దానికి సంబంధించి మున్ముందు మాట్లాడదామని దాటవేశారు. గురువారం తిరుమల శ్రీవారిని మోహన్‌బాబు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్‌ దర్శణంలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన అక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయని, మంచి వాతావరణం ఉందన్నారు. ఈ సందర్భంగా తాము నిర్మించబోతున్న వంద కోట్ల సినిమా ప్రకటన చేశారు. అయితే పూర్తి వివరాలు మాత్రం విష్ణుబాబు చెబుతాడని ఆ మ్యాటర్‌ని స్కిప్‌ చేశారు మోహన్‌బాబు. అయితే ఈ సినిమా మోహన్ బాబు యూనివర్సిటీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్టు సమాచారం. 

మరోవైపు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మ్యాటర్‌ ఓపెన్‌ అయ్యారు. ఏపీలో రజనీకాంత్‌.. టీడీపీ నిర్వహించిన ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల్లో రజనీకాంత్‌ గెస్ట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు హైదరాబాద్‌ ని చూస్తేంటే అమెరికాలో ఉన్నామా? అనే ఫీలింగ్‌ కలుగుతుందని, దానికి కారణం చంద్రబాబే అని రజనీకాంత్‌ అన్నారు. దీంతోపాటు ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఇది వివాదంగా మారింది. ముఖ్యంగా అధికార వైసీపీ నాయకులు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. రజనీకాంత్‌పై విమర్శలు గుప్పించారు. అయితే రజనీకాంత్‌, మోహన్‌బాబు మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. 

దీనిపై ఇప్పటి వరకు మోహన్‌బాబు స్పందించలేదు. తాజాగా తిరుమలలో ఈ ప్రశ్న మోహన్‌బాబుకి ఎదురయ్యింది. రజనీకాంత్‌ వ్యవహారంపై మీరు మౌనంగా ఉండటానికి కారణమేంటని ప్రశ్నించగా, తాను వివాదాల జోలికి వెళ్లదలుచుకోలేదని, రజనీకాంత్‌ గురించి మాట్లాడాలంటే రోజైనా సరిపోదని తెలిపారు. ప్రస్తుతం మోహన్‌బాబు వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. హాట్‌ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ఆయన త్వరలో వంద కోట్లతో ప్రాజెక్ట్ చేయబోతున్నామనే కామెంట్‌ ఆద్యంతం ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. 

ఇక మోహన్‌బాబు ఇటీవల మెయిన్‌లీడ్‌గా సక్సెస్‌ కాలేకపోతున్నారు. ఆయన నటించిన `సన్నాఫ్‌ ఆఫ్‌ ఇండియా` దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. మరోవైపు ఇటీవల సమంత నటించిన `శాకుంతలం`లో దుర్వాస మహర్షి పాత్రలో నటించారు. కాసేపు మెరిసి మెప్పించారు. మోహన్‌బాబు మెయిన్‌ లీడ్‌గా మంచు విష్ణు ఓ సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారట.