అబార్షన్ అయితే బూటకం అన్నారు.. షూటింగ్ సెట్లో జరిగిన అవమానాన్ని బయటపెట్టిన మంత్రి స్మృతి ఇరానీ
కేంద్ర మంత్రి, నటి స్మృతి తాను షూటింగ్ల్లో పాల్గొనే సమయంలో ఎదురైన ఓ అవమానాన్ని పంచుకున్నారు. తనకు గర్భస్రావం అవుతుంటే అదొక పెద్ద నాటకంలా భావించి అవమానించినట్టు చెప్పింది.
`జైబోలో తెలంగాణ` సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయ్యారు నటి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. 2011లో ఈ సినిమా వచ్చి పెద్ద విజయం సాధించింది. ఎన్ శంకర్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఆమె కెరీర్లో మూడు సినిమాల్లో నటించగా, అందులో ఒకటి తెలుగు సినిమా కావడం విశేషం. అంతకు ముందు సీరియల్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు స్మృతి ఇరానీ. `రామాయణ్`లో సీతగా నటించి మెప్పించారు. దీంతోపాటు `క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ` సీరియల్ ఆమెకి ఇండియా వైడ్గా గుర్తింపుని తెచ్చింది.
ప్రస్తుతం ఆమె కేంద్ర మంత్రిగా ఉన్నారు. మహిళ శిశు సంక్షేమ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా స్మృతి తాను షూటింగ్ల్లో పాల్గొనే సమయంలో ఎదురైన ఓ అవమానాన్ని ఆమె తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తనకు గర్భస్రావం అవుతుంటే అదొక పెద్ద నాటకంలా భావించి అవమానించినట్టు చెప్పింది. ఆ విషయాలను స్మృతి పంచుకుంది. `క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ` తనకు ఎంతో పేరుని తెచ్చిపెట్టిందని, ఆ సీరియల్ టైమ్లోనే తాను ప్రెగ్నెంట్ అయ్యాయని, అయితే ఆ విషయం తనకు తెలియలేదు, ఓ రోజు షూట్ చేస్తున్నప్పుడు నీరసంగా అనిపించి, `ఓపిక లేదు ఇంటికి వెళ్లిపోతానని అడిగాను. కానీ వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల చేసేది లేక సాయంత్రం వరకు సెట్లోనే ఉన్నా.
ఆ రోజు సాయంత్రం రక్తస్రావం అయ్యింది, పైగా బాగా వర్షం పడుతుంది. ఆటోని పిలిపించుకుని ఆసుపత్రికి వెళ్లాను. ఆస్పత్రికి వెళ్లాక అబార్షన్ అయినట్టు వైద్యులు తెలిపారు. దీంతో ఎంతో కుంగిపోయాను. ఆ ఘటనతో షూట్ నుంచి కొంత గ్యాప్ తీసుకుందామనుకున్నా, కానీ షూటింగ్ కి రావాల్సిందే అని పట్టుబట్టారు. తాను నాటకం ఆడుతున్నట్టు కల్పితాలు సృష్టించారు. నాకసలు అబార్షన్ కాలేదని, అబద్దం చెబుతున్నానంటూ ఓ వ్యక్తి వదంతులు పుట్టించాడు. అలాంటి సమయంలో నేను చెప్పింది నిజమని నమ్మించడం కోసం రిపోర్ట్ లు తీసుకెళ్లి ఆ ప్రోగ్రామ్ క్రియేటర్ ఏక్తాకపూర్కి చూపించాను` అని వెల్లడించింది స్మృతి ఇరానీ.
అయితే అదే సమయంలో ఇంటి ఈఎంఐలు, ఇతర ఖర్చులు గుర్తుకు వచ్చి తిరిగి సెట్స్ కి వెళ్లానని చెప్పింది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తన సంపాదన రూ.1800 అని, మ్యారేజ్ సమయంలో మా వద్ద రూ.ముప్పై వేలు ఉన్నాయని, ఎలాంటి కార్లు, స్కూటర్లు లేవని, ఎక్కడికి ప్రయాణించాలన్నా ఆటోలోనే వెళ్లేదాన్ని, అది చూసి నా మేకప్ ఆర్టిస్ట్ ఇబ్బందిగా ఫీలయ్యాడు. నా పరిస్థితి చూడలేక `మేడమ్ నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, మీరు ఒక కారు తీసుకోండి` అని తనతో చెప్పాడట. తాజాగా ఇంటర్వ్యూలో ఆ విషయాలను గుర్తు చేసుకున్నారు మంత్రి స్మృతి ఇరానీ. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.