హరికృష్ణ నా సోదర సమానులు.. ఎమోషనల్ అయిన చిరంజీవి!
సినీ నటుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు హరికృష్ణ ఈరోజు తెల్లవారుజామున రోడ్డు యాక్సిడెంట్ లో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ కి తీసుకొచ్చారు.
సినీ నటుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు హరికృష్ణ ఈరోజు తెల్లవారుజామున రోడ్డు యాక్సిడెంట్ లో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ కి తీసుకొచ్చారు. ఆయన మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చివరిచూపు కోసం హరికృష్ణ నివాసానికి ప్రముఖులు తరలివస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్.. హరికృష్ణ నివాసానికి చేరుకొని హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.
నందమూరి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ''ఇది దుర్దినం, దురదృష్టం.. నా సోదర సమానులు నందమూరి హరికృష్ణ ఇలా అకాల మరణం చెందడం దిగ్బ్రాంతికి గురి చేసింది. మనసు కలిచివేస్తుంది. ఈ విషయం తెలిసి ఎంతో బాధకు గురయ్యాము. ఎప్పుడు ఆయనను కలిసినా ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు..
కలిసిన ప్రతిసారి సరదాగా జోక్స్ వేస్తూ నవ్వించేవారు. అటువంటి మనిషి ఇలా మధ్యలోనే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారని ఊహించలేదు. ఈ బాధను తట్టుకోవడానికి వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్నివ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి'' అంటూ తెలిపారు.