మెర్సల్ మూవీలోని డైలాగులపై బీజేపీ అభ్యంతరం
తమిళ తళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన మెర్సల్
మెర్సల్ చిత్రంలోని కొన్ని డైలాగులపై బీజేపీ అభ్యంతరం
జల్లికట్టు నేపథ్యంలో మెర్సల్ తెరకెక్కింటిన ఆట్లీ
దీపావళి కానుకగా 18వతేదీన విడుదలయిన తమిళ సినిమా ‘మెర్సల్’లోని రెండు డైలాగుల విషయంలో భారతీయ జనతా పార్టీ తమిళనాడు విభాగం తీవ్రంగా అభ్యంతరం చెబుతోంది. తక్షణం ఆ సినిమా నుంచి ఆ డైలాగులను తొలగించాలని కమలనాథులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బీజేపీ తమిళనాడు విభాగం అధ్యక్షురాలు తమిళసై సౌందరరాజన్ విజయ్ సినిమాపై, విజయ్ పై విరుచుకుపడ్డారు. తను ఆ సినిమాను చూడలేదు అని అంటూనే ఆమె విజయ్ పై ధ్వజమెత్తడం విశేషం.
‘విజయ్ సినిమాలో జీఎస్టీ మీద, డిజిటల్ ఇండియా మీద వ్యంగ్యంగా స్పందించినట్టుగా తెలుస్తోంది. అది ఏ మాత్రం సబబు కాదు.. విజయ్కి రాజకీయాల్లోకి రావాలని ఉంది, అందుకే అలాంటి డైలాగులు పెట్టించాడు..’అని తమిళసై వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాలను తప్పుపట్టడం సబబు కాదని ఆమె అన్నారు. తను విజయ్ సినిమాను చూడలేదు అని, కానీ ఆ డైలాగులు అభ్యంతరంగా ఉన్నాయని చాలా మంది తనతో చెప్పారని ఆమె అన్నారు.
ఈ సినిమాలోని రెండు సీన్ల పట్ల బీజేపీ, కాషాయవాదులు అభ్యంతరం చెబుతున్నారు. అందులో ఒకటి వడివేలు నటించిన సీన్. వడివేలు, విజయ్ లు విదేశానికి వెళ్తారు. అక్కడ వడివేలు పర్స్ ను దొంగలు కాజేస్తారు. ఆ బ్యాగ్ లో డబ్బేమీ ఉండదు. అప్పుడు వడివేలు ‘థ్యాంక్స్ టు డిజిటల్ ఇండియా..’ అని అంటాడు. ఇక మరో సీన్ లో విజయ్ సింగపూర్కు, ఇండియాకు పోలిక పెట్టి ఒక డైలాగ్ చెబుతాడు. ‘సింగపూర్ లో జీఎస్టీ ఏడు శాతం. అక్కడ ప్రజలందరికీ వైద్యం ఉచితం. ఇండియాలో జీఎస్టీ 28 శాతం. అయితే వైద్యం ఉచితంగా దొరకడం లేదు..’ అని అంటాడు.
వీటి పట్ల బీజేపీ, ఆ పార్టీ అభిమానులు అభ్యంతరం చెబుతున్నారు. ఈ డైలాగులు సత్యదూరం అని వాళ్లు అంటున్నారు. తప్పుడు సమాచారంతో ఈ డైలాగులు పెట్టారని, తక్షణం వీటిని తొలగించాలని వారు వాదిస్తున్నారు.