మంచు విష్ణు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సినిమా కన్నప్ప విడుదలకు ముందే కష్టాల్లో పడింది. ఈ చిత్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారం దొంగిలించినట్టు తెలుస్తోంది. దాంతో మూవీ టీమ్ అలర్ట్ అయ్యింది. ఇంతకీ ఏం జరిగింది?
కన్నప్ప సినిమాకు రిలీజ్ కు ముందే కష్టాలు తప్పలేదు. ఈసినిమా నిర్మాణ సమాచారం ఉన్న హార్డ్డ్రైవ్ అపహరించబడినట్లు సమాచారం. ఈ సంఘటన సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది.
పోలీసుల కథనం ప్రకారం, కోకాపేట ప్రాంతానికి చెందిన రెడ్డి విజయ్కుమార్, ‘24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నారు. విజయ్కుమార్ ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం, ముంబైలోని హెచ్ఐవీఈ స్టూడియోస్ నుంచి కన్నప్ప సినిమాకు సంబంధించిన ముఖ్యమైన కంటెంట్ గల హార్డ్డ్రైవ్ను కొరియర్ ద్వారా ఫిలింనగర్లోని కార్యాలయానికి పంపారు.
మే 25వ తేదీన, ఆ పార్సిల్ను కార్యాలయంలో పనిచేసే ఆఫీస్ బాయ్ రఘు అందుకున్నాడు. అయితే, దీనిని ఎవరికి చెప్పకుండా, చరిత అనే మహిళకు అప్పగించినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత రఘు, చరిత ఇద్దరూ కనిపించకుండా పోయారు. దాంతో విజయ్కుమార్ పోలీసులకు కంప్లైయింట్ చేశారు. తమ సినిమా ప్రాజెక్ట్కు నష్టం కలిగించాలనే కుట్రలో భాగంగానే ఈ పని చేశారని ఆయన పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తుల ప్రోత్సాహంతో ఈ చోరీ జరిగిందని ఆయన ఆరోపించారు.
బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ లో కేసు నమోదు అయిన తర్వాత, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హార్డ్డ్రైవ్ను తీసుకెళ్లిన వ్యక్తుల గురించి, వారి వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. కన్నప్ప’ సినిమాలోని కీలక టెక్నికల్ డేటా, విజువల్ ఎఫెక్ట్స్ తో ముడిపడి ఉండటంతో, దానికి చెందిన సమాచారం ఉన్న హార్డ్డ్రైవ్ గల్లంతవడం సినిమాపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని మూవీ టీమ్ అంటున్నారు.
మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో 100 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతోంది. విష్ణుతో పాటు ఈమూవీలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్ లాంటి ప్రముఖులు నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈమధ్య కాలంలో కన్నప్ప నుంచి రిలీజ్ అయిన అప్ డేట్స్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.