వైసీపీ కండువాతో మహేష్ కటౌట్
వైసీపీ కండువాతో మహేష్ కటౌట్
ప్రిన్స్ మహేష్ మూవీ ‘భరత్ అనే నేను’ థియేటర్లలోకొచ్చి.. మంచి టాక్తో వసూళ్ల పరంగా అదరగొడుతోంది. రెండు ఫ్లాపులిచ్చిన గతాన్ని మరిచిపోయేలా సంబరాలు చేసుకుంటున్నారు ప్రిన్స్ ఫ్యాన్స్. పైగా.. ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ బాగా ఇమిడిపోయాడు.
ఇదంతా ఒక ఎత్తయితే.. ప్రిన్స్ మూవీకి పొలిటికల్ కలర్లు అద్దడం కూడా మొదలైపోయింది. ‘భరత్ అనే నేను మూవీ’ రాజకీయ వాసనతో గుప్పుమంటోంది. సీమ వైసీపీ అభిమానులు ఒక అడుగు ముందుకేసి.. మహేష్ని ఏకంగా తమ పార్టీలో కలిపేసుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి- వైఎస్ జగన్.. వీళ్లిద్దరి మధ్యలో కృష్ణ-మహేష్ బాబులతో కూడిన కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి.. తమ అభిమానాన్ని చాటుకున్నారు. పంచెకట్టుతో చూడముచ్చటగా వున్న ఈ ఫ్లెక్సీలు అనంతపురం శాంతి థియేటర్ వద్ద కొలువు తీరాయి.సూపర్ స్టార్ కృష్ణ ఎప్పట్నుంచో కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉండేవారు. కానీ.. మహేష్ బాబు మాత్రం తనకూ రాజకీయాలకూ చాలా దూరం అంటూ చాలా సార్లు చెప్పిన విషయం తెలిసిందే.