మహేష్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. తండ్రి కృష్ణ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతూ ఉంటే, మహేష్ ఓ పసివాడికి ప్రాణదానం చేశాడు. అతనికి వైద్యం చేయించి జీవితాన్ని ఇచ్చారు.
కార్డియాక్ అరెస్ట్ తో కృష్ణ కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ని కాంటినెంటల్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. విషయం తెలుసుకున్న మహేష్ హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. సమయం గడిచే కొద్ది ఆయన పరిస్థితి విషమిస్తున్నట్లు వైద్యులు మహేష్ కి చెప్పారు. తండ్రిని ఎలాగైనా కాపాడుకోవాలనే తపన, ఏమవుతుందో అన్న టెన్షన్ గంటల తరబడి మహేష్ ని వెంటాడింది. ఇంత రిస్క్ లో ఎవరైనా ఇతరుల గురించి ఆలోచిస్తారా? సహాయం చేయాలనే ఆలోచన వస్తుందా? కానీ మహేష్ ఆలోచించాడు . ఒక పసి ప్రాణం కాపాడారు.
కృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోజే విజయవాడలో మోక్షిత్ సాయి అనే చిన్నారి హార్ట్ ప్రాబ్లమ్ తో ఆంధ్రా హాస్పిటల్ లో చేరాడు. పేదవారైన మోక్షిత్ పేరెంట్స్ కి ఆపరేషన్ చేయించే స్థోమత లేదు. వారు మహేష్ ఫౌండేషన్ కి అప్లై చేసుకున్నారు. మోక్షిత్ సమాచారం తెలుసుకున్న మహేష్ ఆపరేషన్ కి అవసరమైన ఏర్పాట్లు చేశారు. తన ఫౌండేషన్ ద్వారా మోక్షిత్ కి చికిత్స అందేలా చేశారు. ఒక బాలుడుకి జీవితం ప్రసాదించారు.
ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మహేష్ మంచి మనసు, ఔదార్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. పుట్టెడు దుఃఖంలో కూడా ఇతరులకు సాయం చేయాలనే బాధ్యత మరవలేదని కొనియాడుతున్నారు. ఇప్పటి వరకు వేయి మందికి పైగా చిన్నారులకు మహేష్ హార్ట్ ఆపరేషన్స్ చేయించారు. మహేష్ కుమారుడు గౌతమ్ చిన్నప్పుడు తీవ్ర అనారోగ్యం బారినపడ్డారు. లక్షలు ఖర్చుచేసి మహేష్ తనని కాపాడుకున్నారు.
డబ్బులు లేని పేరెంట్స్ఈ పరిస్థితి ఏమని మహేష్ ఆలోచించారు. ఆ సమయంలో మహేష్ మదిలో చిన్న పిల్లలకు వైద్యం చేయించాలనే ఆలోచన పుట్టింది. అప్పటి నుండి హార్ట్ సర్జరీలు ఉచితంగా చేయిస్తున్నారు. మహేష్ ఫౌండేషన్, ఆయన సేవా కార్యక్రమాల గురించి ఇటీవల కాలం వరకూ తెలియదు. ఆయన ఎలాంటి ప్రచారం కోరుకోలేదు. దీంతో ఈ విషయం బయటకు రాలేదు. కాగా బుధవారం మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి.
