అబ్బే.. అలాంటిదేం లేదు , కొట్టిపారేసిన మహేష్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం మహర్షి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం మహర్షి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. భరత్ అనే నేను చిత్రం తర్వాత చేసిన ఈ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా ఆయనకి మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమా అనంతరం అనీల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నారనే సంగతి తెలిసిందే. దాంతో అనీల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోయే చిత్రంలో ఆయన పాత్ర గురించి అనేక ఊహాగానాలు మీడియాలో వస్తున్నాయి. మరీ ముఖ్యంగా మహేష్ మరోసారి పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారని, దూకుడు తరహాలో సినిమాలో ఉండబోతోందని అంటున్నారు.
మహర్షి ప్రమోషన్ లో కలిసిన మీడియాతో మహేష్ ఈ రూమర్స్ ని కొట్టిపారేసారు. తాను పోలీస్ పాత్ర చేయటం లేదని తేల్చి చెప్పారు. అయితే అది ఎలాంటి పాత్ర అనేది మాత్రం రివీల్ చేయలేదు. ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు అనీల్ రావిపూడి ..మహేష్ పాత్రను చాలా హిలేరియస్ గా రూపొందించాడని, అలాంటి పాత్ర గతంలో మహేష్ చేయలేదని, ఖలేజాకు, దూకుడు చిత్రాలకు, ఆ బాడీ లాంగ్వేజ్ కు చాలా దూరంగా ఉంటుందని చెప్తున్నారు.
ఇక ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ అయిన ఈమూవీకి ‘సరిలేరు నీకెవ్వరూ’ అన్న టైటిల్ ఫిక్స్ చేయాలని అనీల్ రావిపూడి భావిస్తున్నారట. ఎన్టీఆర్ క్లాసిక్ ‘కంచుకోట’ సినిమాలోని పాట పల్లవి నుంచి తీసుకున్నారు ‘సరిలేరు నీకెవ్వరూ’ టైటిల్ ను . అయితే మహేష్ మాత్రం ఈ టైటిల్ పై పెద్దగా ఇంట్రస్ట్ చూపటం లేదని వినికిడి.
ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుండగా, జూన్ నుండి సెట్స్ పైకి తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈచిత్రంలో ప్రముఖ నటుడు జగపతి బాబు విలన్ రోల్ లో నటించనుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుంది. దిల్ రాజు , అనిల్ సుంకర కలిసి నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కి ప్రేక్షకులముందుకు రానుంది.
పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2 ఇలా వరుస హిట్స్ తో దూసుకెళుతున్న అనీల్ రావిపూడి కు మహేష్ తో చేయటం జాక్ పాట్ లాంటిదే. హిట్ కొడితే వరస స్టార్స్ తో సినిమాలు ఉంటాయి.