ఆ విషయంలో మహేశ్ బాబు వెనకడుగు.. అభిమానులకు నిరాశ.. ‘ఎస్ఎస్ఎంబీ28’ పరిస్థితి అంతేనా?
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) తన అభిమానుల ఊహకు అందని విధంగా నిర్ణయాలు తీసుకుంటూ షాక్ కు గురిచేస్తున్నారు. తోటి స్టార్లతో పోల్చితే మహేశ్ ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్నారంటున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో రూపుదిద్దుకుంటున్న చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఊహించని విధంగా స్పందన లభిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ తోపాటు సౌత్ ఇండస్ట్రీల నుంచి ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే ముఖ్యంగా బాలీవుడ్ లో ఆందోళనకర వాతావరణం ఏర్పడుతోంది. ఇప్పటికే ‘బాహుబలి’,‘ఆర్ఆర్ఆర్’,‘పుష్ఫ’ రీసెంట్ గా వచ్చిన ‘కార్తికేయ 2’ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా సత్తాను చాటుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు సినిమా క్రేజ్ పెరగడంతో పాటు టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్లు కూడా పుట్టుకొస్తున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ ఆ వరుసలోనే ఉన్నారు. కానీ మహేశ్ బాబు మాత్రం ఈ విషయంలో వెనకంజలోనే ఉన్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తన కేరీర్ లో బ్లాక్ బాస్టర్ హిట్ లను సొంతం చేసుకున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు మాత్రం పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ సంపాదించుకోవడంలో ఆలస్యంగా చేస్తున్నారు. ముఖ్యంగా మహేశ్ బాబు ఆ దిశగా అడుగులు వేయడం లేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఆయన బహుభాషా చిత్రాలు, పాన్ ఇండియా చిత్రాలపై ఫోకస్ చేయకపోవడమే అందుకు కారణంగా చూపుతున్నారు. చివరిగా రిలీజ్ అయిన ‘సర్కారు వారి పాట’తోనే నార్త్ లోకీ అడుగు పెడుతారని అందరూ భావించారు. కానీ తెలుగులోనే రిలీజ్ చేసి అభిమానులను నిరాశ పరిచారు. ఇలాగైతే సూపర్ స్టార్ ను పాన్ ఇండియా స్టార్ గా చూసేదెప్పుడనే సందేహాలు ఫ్యాన్స్ లో కలుగుతున్నాయి.
ఈ క్రమంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ - మహేశ్ బాబు కాంబినేషన్ లో హ్యాట్రిక్ కాంబినేషన్ సెట్ అయ్యింది. ఇప్పటికే ‘ఎస్ఎస్ఎంబీ 28’ వర్క్ టైటిల్ పేరిట షూటింగ్ కూడా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. కానీ అధికారిక ప్రకటనేది రాలేదు. హ్యాట్రిక్ కాంబో కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అలాగే సినిమాను ఏకంగా ఐదు భాషల్లో రిలీజ్ చేస్తారనే వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ వాటన్నింటికి మహేశ్ బాబు చెక్ పెట్టినట్టు తెలుస్తోంది. కేవలం తెలుగులోనే రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేయాలని, కనీసం హిందీలో కూడా రిలీజ్ కాబోదనే వార్తలు వినిపిస్తున్నాయి. మహేశ్ బాబునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వచ్చే సంవత్సరం అన్నీ పాన్ ఇండియా, బహుభాషా చిత్రాలుగా రిలీజ్ అవుతుండగా.. మహేశ్ నటిస్తున్న ‘ఎస్ఎస్ఎంబీ28’ మాత్రమే తెలుగుకు పరిమితం కానుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. గ్లామర్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde) మరోసారి మహేశ్ బాబు సరసన నటిస్తోంది. SSMB28 వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.