ఎన్నికల్లో పోటీపై మాధురీ దీక్షిత్ క్లారిటీ
జూన్లో మాధురీ దీక్షిత్ని అమిత్ షా ఆమె నివాసంలో భేటీ అయ్యారు. మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ఆమెకు వివరించారు. అయితే.. మాధురీ ఎన్నికల విషయం చర్చించేందుకే అమిత్ షా ఆమెను కలిశారంటూ ప్రచారం మొదలైంది.
బాలీవుడ్ అందాల తార మాధురీ దీక్షిత్.. త్వరలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయనున్నారంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. కాగా.. ఆ ప్రచారంపై మాధురీ తాజాగా స్పందించారు. తాను ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడం లేదంటూ ఆమె క్లారిటీ ఇచ్చారు.
2019 లోక్సభ ఎన్నికల్లో పుణె లోక్సభ స్థానం నుంచి పోటీకి నిలబెట్టేందుకు రూపొందించిన అభ్యర్థుల తుది జాబితాలో మాధురీ దీక్షిత్ పేరున్నట్లు బీజేపీ సీనియర్ నేత ఒకరు ఇటీవల తెలిపారు. మరోవైపు సంపర్క్ ఫర్ సమర్థన్’ పేరిట మద్దతు కోరుతూ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఈ ఏడాది పలువురు సినీ, వ్యాపార ప్రముఖులను కలిసిన సంగతి తెలిసిందే. వీరిలో మాధురీ కూడా ఉన్నారు.
ఇందులో భాగంగానే జూన్లో మాధురీ దీక్షిత్ని అమిత్ షా ఆమె నివాసంలో భేటీ అయ్యారు. మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ఆమెకు వివరించారు. అయితే.. మాధురీ ఎన్నికల విషయం చర్చించేందుకే అమిత్ షా ఆమెను కలిశారంటూ ప్రచారం మొదలైంది. ఇక ఆమె పోటీ ఖాయమని పలు మీడియా సంస్థలు వార్తలు వెలువరించాయి. కాగా.. ఆమె ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ.. తాను పోటీచేయడం లేదని వివరణ ఇచ్చారు.