సారాంశం

సితార ఎంటర్ టైన్ మెంట్స్  నిర్మిస్తున్న ‘మ్యాడ్’ చిత్రం నుంచి మొదటి పాట విడుదలైంది. భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన సంగీతం అందించారు. యూత్ ను ఆకట్టుకునేలా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు.
 

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మునుపెన్నడూ చూడని తరహాలో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్' (Mad) తో అలరించడానికి సిద్ధమవుతోంది. సూర్యదేవర నాగ వంశీ సమర్పిస్తున్న ఈ సినిమాతో సూర్యదేవర హారిక నిర్మాతగా పరిచయమవుతున్నారు. ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ పై సాయి సౌజన్య ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ వినోదాత్మక చిత్రంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఇక ‘ధమాకా’, ‘బలగం’ వంటి చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో (Bheems ceciroleo) ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మ్యాడ్ సినిమా నుంచి ఈరోజు "ప్రౌడ్సే బోలో ఐ యామ్ సింగిల్" అనే మొదటి పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాట జీవితంలో మింగిల్ కాకుండా.. సింగిల్ గా సంతోషంగా, గర్వంగా ఎలా ఉండవచ్చో ప్రధాన పాత్రలకు వివరిస్తున్నట్టుగా సాగింది. 'ప్రౌడ్సే బోలో ఐ యామ్ సింగిల్' పాట సంగీతం ఎవరితోనైనా కాలు కదిపించేలా ఉంది. ఇక సాహిత్యం యువత మెచ్చేలా.. ముఖ్యంగా లింగభేదాలు లేకుండా ప్రతి యొక్క సింగిల్ ని కట్టిపడేసేలా ఉంది. 

ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 'ప్రౌడ్సే బోలో ఐ యామ్ సింగిల్' పాట ప్రేక్షకుల్లో, ముఖ్యంగా యువతలో సినిమా చూడాలనే ఆసక్తిని రెట్టింపు చేసేలా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.