మా ఎన్నికల హీట్: గట్టిపోటీ దారులతో మంచు విష్ణు ప్యానెల్.. పోటీ రసవత్తరం!
నేడు ఉదయం 11గంటలకు తన ప్యానెల్ని ప్రకటించబోతున్నట్టు వెల్లడించారు. చెప్పిన ప్రకారం కొద్దిసేపటి క్రితం మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులను ప్రకటించారు.
`మా ఎన్నికల(maa elections) వేడి మొదలై పోయింది. అక్టోబర్ 10న ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పోటీదారులుగా ఉన్న మంచు విష్ణు తన ప్యానెల్ ప్రకటించారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నర్సింహారావు అధ్యక్షుడి కోసం పోటీ పడుతున్నారు. మరోవైపు బండ్ల గణేష్ ఇండిపెండెంట్గా జనరల్ సెక్రెటరీగా పోటీలో ఉన్నారు. అయితే ప్రకాష్ రాజ్ గత నెలలోనే తన ప్యానెల్ని ప్రకటించారు.
బుధవారం తన ప్యానెల్తో మంచు విష్ణు మీటింగ్ నిర్వహించారు. ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణు ట్వీట్ చేశారు. నేడు ఉదయం 11గంటలకు తన ప్యానెల్ని ప్రకటించబోతున్నట్టు వెల్లడించారు. చెప్పిన ప్రకారం కొద్దిసేపటి క్రితం మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులను ప్రకటించారు.
మొత్తం 27 మంది సభ్యులతో కూడిన మంచు విష్ణు ప్యానెల్ లో మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీపడుతుంటే, రఘుబాబు జనరల్ సెక్రటరీ, బాబు మోహన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, మాదాల రవి, థర్టీ ఇయర్స్ పృథ్వి వైస్ ప్రెసిడెంట్స్ గా, గౌతమ్ రాజు, కరాటే కళ్యాణి జాయింట్ సెక్రెటరీలు గా, ఇక శివ బాలాజీ ట్రెజరీ పదవికి పోటీ పడనున్నారు.
ఇక ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా అర్చన, అశోక్ కుమార్, గీతా సింగ్, హరినాథ్ బాబు, జయవాణి, శైలజ, మాణిక్, పూజిత, సంపూర్ణేష్ బాబు, రాజేశ్వరి రెడ్డి, రేఖ, శశాంక్, శివన్నారాయణ,శ్రీలక్ష్మి, శ్రీనివాసులు పి, స్వప్న మాధురి, విష్ణు బొప్పన, వడ్లపట్ల ఎమ్ ఆర్ సి ఉన్నారు.
మంచు విష్ణుకు ప్రధాన పోటీదారుగా ఉన్న ప్రకాష్ రాజ్ సైతం 27మంది సభ్యులతో కూడిన ప్యానెల్ ప్రకటించారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నందు జయసుధ, సాయి కుమార్, బెనర్జీ, శ్రీకాంత్, అనసూయ, సుడిగాలి సుధీర్ వంటి ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ మంచు విష్ణుకు మద్దతు ప్రకటించగా, మెగా ఫ్యామిలీ నుండి నాగబాబు ప్రకాష్ రాజ్ కి గట్టి సప్పోర్ట్ గా నిలుస్తున్నారు. ఈ సారి ఇద్దరి గట్టి పోటీదారుల మధ్య పోరు రసవత్తరంగా జరగనున్నట్లు అర్థం అవుతుంది.