మా ఎన్నికల వివాదం... కృష్ణంరాజు మంత్రాంగం
ఎన్నికల విషయంలో నిర్ణయం తీసుకునే బాధ్యత క్రమశిక్షణా సంఘంలో సభ్యునిగా ఉన్న కృష్ణం రాజుకి ఇచ్చారని తెలుస్తుంది. ఎన్నికలు ఎప్పుడు జరుపుతారంటూ కృష్ణం రాజుకు లేఖలు కూడా అందాయట.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఎప్పుడు జరపాలి, ఎలా జరపాలి, ఎన్నికలా? లేక ఏకగ్రీవమా?... ఇలా అనేక విషయాలపై సందిగ్ధత కొనసాగుతుంది.ప్రస్తుత మా కమిటీ పదవీ కాలం 2021మార్చితో ముగిసింది. అయితే కోవిడ్ పరిస్థితుల కారణంగా ఎన్నికలు జరపలేదు. అలాగే సెప్టెంబర్ లో ఎన్నికలు జరపనున్నట్లు మా అధ్యక్షుడు నరేష్ తెలియజేశారు.
ఎన్నికల కారణంగా పోటీలో ఉన్న సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం వలన మా ప్రతిష్ట దెబ్బతింటుందని కొందరు భావిస్తున్నారు. ఈ విషయంపై ఇటీవల స్పందించిన బాలకృష్ణ సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. గ్లామర్ ఇండస్ట్రీలో సమస్యలు, వివాదాలు ఓపెన్ గా మాట్లాడడం సరికాదని ఆయన అన్నారు. కాగా మా సభ్యుల మధ్య వివాదాల నేపథ్యంలో పరిష్కరించడానికి, చర్యలు తీసుకోవడానికి 2019లో క్రమశిక్షణగా సంఘం ఏర్పాటు చేశారు.
ఈ క్రమ శిక్షణా సంఘంలో చిరంజీవి, మోహన్ బాబు, మురళీ మోహన్, జయసుధ, కృష్ణం రాజు సభ్యులుగా ఉన్నారు. మా డైరీ లాంఛ్ కార్యక్రమంలో రాజశేఖర్ పబ్లిక్ గా తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. ఇలాంటప్పుడు క్రమశిక్షణా సంఘం ఎందుకు అంటూ.. రాజీనామా చేస్తున్నట్లు చిరంజీవి ప్రకటించారు. అయితే ఆయన రాజీనామాను మిగతా సభ్యులు అంగీకరించలేదు.
కాగా ప్రస్తుత ఎన్నికల విషయంలో నిర్ణయం తీసుకునే బాధ్యత క్రమశిక్షణా సంఘంలో సభ్యునిగా ఉన్న కృష్ణం రాజుకి ఇచ్చారని తెలుస్తుంది. ఎన్నికలు ఎప్పుడు జరుపుతారంటూ కృష్ణం రాజుకు లేఖలు కూడా అందాయట. అలాగే ప్రస్తుత మా కమిటీ పదవీ కాలం ముగియడంతో, ఎన్నికలు ఆలస్యమైన నేపథ్యంలో తాత్కాలింగా ఓ కమిటీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చిందట. ఆ తాత్కాలిక కమిటీ ద్వారా మా సభ్యుల మధ్య వివాదాలు, పెడింగ్ పనులు నెరవేర్చాలనేది కొందరి ఆలోచనగా తెలుస్తుంది. కావున మా ఎన్నికల నిర్ణయం కృష్ణం రాజు వద్దకు చేరిందని సమాచారం.