సీసీ ఫుటేజ్ ఎంతమందికని ఇవ్వాలి.. నాపై ఆరోపణలు పబ్లిసిటీ స్టంటే: ప్రకాశ్రాజ్కు ‘‘మా’’ ఎన్నికల అధికారి కౌంటర్
ప్రకాశ్రాజ్కు గట్టి కౌంటరిచ్చారు మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్. చాలా నిజాయితీగా ‘‘మా’’ ఎన్నికలు నిర్వహించామని ఆయన స్పష్టం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ కావాలని అడిగారని.. కానీ నిబంధనల ప్రకారమే ఇస్తామని కృష్ణమోహన్ వెల్లడించారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (movie artists association) ‘‘మా’’ (maa elections) అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరిగిన సంగతి తెలిసిందే. ఫలితాలు వెలువడి విజేత ఎవరో తేలిపోయినప్పటికీ ఇంకా ఫిలింనగర్లో వేడి మాత్రం చల్లారడం లేదు. మా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. కౌంటింగ్ రోజు తమ సభ్యులపై మోహన్ బాబు దాడి చేశారని ప్రకాశ్రాజ్ (prakash raj) సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఎన్నికలు జరిగిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టుకెక్కేందుకు (supreme court) ఆయన రెడీ అవుతున్నారు. దీనిలో భాగంగానే ఎన్నికలు, కౌంటింగ్ నాటి సీసీటీవీ ఫుటేజ్ కావాలని మా ఎన్నికల అధికారి (maa election officer) కృష్ణమోహన్కు (krishna mohan) ప్రకాశ్ రాజ్ లేఖ రాశారు.
ఈ నేపథ్యంలో కృష్ణమోహన్ స్పందిస్తూ.. ప్రకాశ్రాజ్కు గట్టి కౌంటరిచ్చారు. చాలా నిజాయితీగా ‘‘మా’’ ఎన్నికలు నిర్వహించామని ఆయన స్పష్టం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ కావాలని అడిగారని.. కానీ నిబంధనల ప్రకారమే ఇస్తామని కృష్ణమోహన్ వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడం మొదలుపెడితే ఎంతమందికని ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలపై ప్రకాశ్రాజ్ ప్యానెల్ లేనివాటిని కృత్రిమంగా ప్రచారం చేస్తోందని కృష్ణమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల పోలింగ్, ఫలితాలపై లిఖితపూర్వక ఫిర్యాదులు మాకు అందలేదని ఆయన తెలిపారు.
ప్రకాశ్రాజ్, విష్ణు (manchu vishnu) సమ్మతంతోనే తర్వాతి రోజు ఎన్నికల ఫలితాలు ప్రకటించానని కృష్ణమోహన్ వెల్లడించారు. బ్యాలెట్ పత్రాలు ఇంటికి తీసుకెళ్లానని ఆరోపిస్తున్నారని ఆరోపిస్తున్నారు అది అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. డమ్మీ బ్యాలెట్ పేపర్స్ను మాత్రమే తాను పోలింగ్ కేంద్రంలో భద్రపరిచానని కృష్ణమోహన్ తెలిపారు. కౌంటింగ్ సిబ్బంది అలసిపోయినందునే ఆదివారం రాత్రి ఓట్ల లెక్కింపు నిలిపివేశామని ఆయన చెప్పారు. పబ్లిసిటీ పిచ్చితోనే తనపై రోజుకో ఆరోపణ చేస్తున్నారని కృష్ణమోహన్ మండిపడ్డారు. మోహన్బాబు తనకు 30 ఏళ్లుగా తెలుసునని చెప్పారు.
కాగా, న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సీసీ ఫుటేజ్ కీలకమని ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు చెబుతున్నారు. ఆధారాలతో సహా కోర్టును ఆశ్రయించాలని ప్యానెల్ నిర్ణయించింది. రెండు మూడు రోజులుగా ఇదే అంశంపై ప్రకాశ్ రాజ్ ప్యానెల్ చర్చించినట్లుగా తెలుస్తోంది. అందరి ఏకాభిప్రాయంతో సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు.