ఏపీ రిలీజ్: 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కి మరో షాక్..!
రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రెండువారాల క్రితం తెలంగాణలో విడుదలైంది.
రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రెండువారాల క్రితం తెలంగాణలో విడుదలైంది. కోర్టు తీర్పు కారణంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం రిలీజ్కాలేదు. ఎన్నికల తరువాత అయినా సినిమా రిలీజ్ చేసుకుందామని చిత్రబృందం భావించింది.
ఈ మేరకు ఏప్రిల్ 12న సినిమా రిలీజ్ ఉంటుందని వర్మ ట్విట్టర్ ద్వారా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాడు. కానీ ఇప్పుడు అది కూడా జరిగేలా కనిపించలేదు. ఏపీలో ఈ సినిమాను రిలీజ్ చేయడంపై ఓ నిర్ణయం తీసుకునేందుకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ యు.దుర్గాప్రసాద్ రావులతో కూడిన ధర్మాసనం గురువారం నాడు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను వీక్షించింది.
ఈరోజు ఏదోకటి తేలితే.. రేపు రిలీజ్ చేయాలనుకున్న యూనిట్ షాక్ తగిలింది. సినిమా చూసిన ధర్మాసనం ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు. తీర్పుని సోమవారం నాటికి వాయిదా వేసింది.
ఎన్నికల తరువాత కూడా రిలీజ్ చేసే విషయంలో ఓ నిర్ణయానికి రావడం లేదంటే ఇక ఏపీలో ఈ సినిమా రిలీజ్ అవుతుందా..? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. సోమవారం నాడు కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో చూడాలి!