శృతీహాసన్ కు ఖుష్బూ సుందర్ వార్నింగ్
- శృతీహాసన్ సంఘమిత్ర నుంచి తప్పుకున్న తర్వాత ఖుష్బూ ఆగ్రహం
- ప్రాజెక్టుపై అనవసరంగా అవాకులు చవాకులు పేలుతోందన్న ఖుష్బూ
- సినిమా అంటే తెలియని వాళ్లు సోషల్ మీడియాలో ఏదేదో అంటున్నారని వ్యాఖ్యలు
బాహుబలి ఇచ్చిన సక్సెస్ దృష్టిలో పెట్టుకుని తమిళ దర్శకుడు ఖుష్బూ భర్త సుందర్ కూడా సంఘమిత్ర పేరుతో భారీ ప్రాజెక్టు తలపెట్టాడు. ఈ మూవీలో శృతీహాసన్ ను లీడ్ రోల్ కోసం ఎంపిక చేశారు. అయితే కారణాలేమైనా ఆ ప్రాజెక్టు నుంచి శృతిహాసన్ తప్పుకుంది. దీంతో ఆమెపై సీనియర్ నటి కుష్భూ పరోక్షంగా బాగానే విరుచుకుపడింది. సంఘమిత్ర చిత్రంపై అవసరం లేకున్నా అవాకులు, చెవాకులు పేలుతోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. సంఘమిత్ర నుంచి శృతి హాసన్ తప్పుకొన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారమే.
తమిళ చిత్ర పరిశ్రమలో గతంలో మునుపెన్నడూ లేని విధంగా సంఘమిత్ర చిత్రాన్ని రూ.400 కోట్ల బడ్జెట్ రూపొందించాలని సంకల్పించారు దర్శకుడు సుందర్ సీ. కేన్స్ ఫిలిం ఫెసివల్లో ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణను అంగరంగ వైభవంగా చేశారు. అంతా సవ్యంగా సాగుతుందని అనుకుంటున్న సమయంలోనే ఈ చిత్రం నుంచి శృతిహాసన్ తప్పుకోవడంతో ఒక్కసారిగా ప్రాజెక్టు సందిగ్దంలో పడిపోయింది.
శృతీ హాసన్ మాత్రం సంఘమిత్ర స్క్రిప్టుపై క్లారిటీ లేదు. ఆ స్క్రిప్టు ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మరో రెండేళ్లు కెరీర్ను పణంగా పెట్టలేను. అందుకే ఈ చిత్రం నుంచి తప్పుకొంటున్నాను అని శృతిహాసన్ కారణాలు చెప్పింది. దాంతో సంఘమిత్ర ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో శృతిహాసన్ ను ఖుష్భూ టార్గెట్ చేయడం చర్చానీయంశమైంది. ఈ రోజుల్లో సినిమా అంటే 70 శాతం ప్రీ ప్రొడక్షన్ వర్క్, 30 శాతం షూటింగ్ ఉంటుంది అని చాలా మందికి తెలియదు. సంప్రదాయ సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చినా ఒకరికి సరైన అవగాహన లేదు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి పబ్లిక్ ఫోరమ్లను ఉపయోగించుకోకూడదు అని శృతీహాసన్ ను ఉద్దేశించి ఖుష్భూ వ్యాఖ్యానించారు.
తప్పులు సరిదిద్దుకుంటే మంచిదని, సినీ పరిశ్రమలో చాలా కాలం మనుగడ కొనసాగించడానికి అప్పుడే అవకాశం ఉంటుందని శృతీహాసన్కు పరోక్షంగా సలహా ఇచ్చారు. వివాదం ముగుస్తుందనుకున్న నేపథ్యంలో ఖుష్బూ మళ్లీ ఆ అంశాన్ని గెలికి రచ్చ చేయడంపై సినీ వర్గాలు రకరకాలుగా చెప్పుకొంటున్నారు
తమిళ చలన చిత్ర చరిత్రలోనే భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రంలో జయం రవి, ఆర్య హీరోలుగా నటిస్తున్నారు. తెనందల్ ఫిల్మ్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రం నుంచి తప్పుకొన్న శృతిహాసన్ ప్రస్తుతం కమల్ శభాష్ నాయుడు చిత్రంలో నటిస్తోంది. ఖుష్బూ వ్యాఖ్యలపై ఇంకా శృతిహాసన్ స్పందించలేదు. ఒకవేళ స్పందిస్తే వారిద్దరి మధ్య వివాదం జోరందుకునే అవకాశం ఉందని కోలీవుడ్ జనాలు అంచనా వేస్తున్నారు.