మహానటి సావిత్రి చిత్రంలో లీజ్ రోల్ చేస్తున్న కీర్తి సురేష్ ఈ పాత్ర కోసం 15 కిలోల బరువు పెరగాలని సూచించిన దర్శకుడు అనుష్కను చూసాక కూడా బరువు పెరిగే ఆలోచన చేస్తానా అంటున్న కీర్తి సురేష్
హాలీవుడ్లో అయినా, బాలీవుడ్లో అయినా చివరకు టాలీవుడ్ లో అయినా హీరో,హీరోయిన్లు తమ పాత్రలకు అవసరమైన మేరకు బరువు పెరగటం, శరీరాకృతిని పాత్రకు తగ్గట్టు మలుచుకునే ప్రయత్నం చేయడం సహజంగా చూస్తూనే ఉంటాం. చాలా మంది హీరోలు ఈ తరహా ప్రయోగాలకి పాల్పడి సత్ఫలితాలు సాధించారు. అయితే ఇలాంటివి హీరోయిన్లకి కలిసి రావని సైజ్ జీరో సినిమాతో అనుష్క తెలుసుకుంది. బాహుబలి లాంటి చారిత్రక సినిమాకు అనుష్క బరువు తగ్గకపోవడం వల్ల షూటింగ్ కు పలుమార్లు అంతరాయం ఏర్పడిందని అప్పట్లో జోరుగానే గుసగుసలు వినిపించాయి.తను ఇప్పటికీ బరువు తగ్గలేక తంటాలు పడుతోన్న అనుష్కని చూసి ఈ తరహా ప్రయోగానికి వెళ్లడానికే యువ హీరోయిన్లు జంకుతున్నారు.
పాత్రలకి అనుగుణంగా బరువు పెరగమని, తగ్గమని దర్శకులు సూచిస్తుంటారు. ఒక నాలుగైదు కేజీలు అంటే మేనేజ్ చేయవచ్చు కానీ భారీ మార్పులు మంచిది కాదని అనుష్క వల్ల తెలిసింది. దీంతో 'మహానటి' చిత్రంలో నటిస్తోన్న కీర్తి సురేష్తో పదిహేను కిలోల బరువు పెరగాలని చెప్పిన దర్శకుడికి ఆమె సారీ చెప్పేసిందట.
సావిత్రి పాత్రలో అతికినట్టు కనిపించాలనే ఉద్దేశంతో ఆమెని బరువు పెరగాలని దర్శకుడు కోరాడట. అయితే అంత భారీ మార్పులకి తాను సిద్ధంగా లేనని, అవసరమైతే ప్రోస్థటిక్స్, విజువల్ ఎఫెక్ట్స్తో మేనేజ్ చేసుకోండని, బరువు పెరిగేదే లేదని చెప్పిందట. కీర్తి సురేష్ హీరోయిన్ అయితే తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో కూడా ఈజీగా మార్కెట్ చేసుకోవచ్చునని మిగతా వారిని కాదని ఆమెకి అవకాశమిచ్చారు.
పైగా ఆమె శరీరాకృతి కూడా సావిత్రి పాత్రకి సూట్ అవుతుందని అనుకున్నారు. కానీ ఈలోగా పెద్ద సినిమాల్లో అవకాశాలు పొందిన కీర్తి ఆ దర్శకుల డిమాండ్స్ మేరకు సన్నబడింది. ఇప్పుడు సావిత్రి చిత్రానికి ఆమెతో చిక్కొచ్చి పడింది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తాను బరువు పెరిగేది లేదని, అవసరమైతే, లావుగా కనిపించే దుస్తులు ధరించి నటిస్తానని తేల్చి చెప్తోందట కీర్తి. మరి లేకుంటే బరువు పెరిగాక ఎవరు పట్టించుకుంటారు. తగ్గాలంటే ఎంత కష్టమో అనుష్కను చూసాక తెలిసి తెలిసీ ఎవరు మాత్రం లావు పెరుగుతారు.
