ప్రయోగాత్మక చిత్రాల్లో నటించే తమిళ హీరోల్లో కార్తీ ఎప్పుడూ ముందుంటాడు. భారీ బడ్జెట్ తో అదే స్థాయి స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన కాష్మారాలో కార్తీ డబుల్ రోల్ చేశాడు. హీరో కార్తీకి తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉండటంతో కాష్మోరా సినిమాను తెలుగు నాట కూడా భారీగా రిలీజ్ చేశారు. మరి బాహుబలితో ప్రేక్షకులు పోల్చిన ఈ మూవీ చివరకు ఏం అయ్యింది... ఇంతహైప్ క్రియేట్ చేసిన కాష్మోరా.. అనుకున్నట్టుగా ప్రేక్షకులను మెప్పించిందా.?
కథ :
విక్రాంత రాజ్యం అనే మహా సామ్రాజ్యం 700 ఏళ్ల క్రితం మహాసామ్రాజ్యంగా విలసిల్లిన రాజ్యం. ఆ సామ్రాజ్యానికి సైన్యాధ్యక్షుడైన రాజనాయక్(కార్తీ) శౌర్య పరాక్రమాల కారణంగా రాజ్యం సువిశాలంగా విస్తరిస్తుంది. అయితే కథనరంగంలో అరివీర భయంకరుడైన రాజనాయక్ స్త్రీలంటే పడి చచ్చే రకం. ఆ కారణంగానే విక్రాంత రాజ్య యువరాణి రత్నమహాదేవి(నయనతార)ని తన సొంతం చేసుకోవాలనుకుంటాడు. రత్నమహాదేవి ప్రేమించిన మరో సామ్రాజ్య యువరాజును నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు రాజ్ నాయక్. దీంతో రత్న మహాదేవి పగతో అతన్ని చంపేస్తుంది. అదే సమయంలో రత్న మహాదేవినీ చంపేస్తాడు రాజ్ నాయక్. కానీ ఇద్దరి మధ్యా పగ మిగిలిపోవడంతో ఏళ్ల తరబడి ప్రేతాత్మలుగా జీవనం సాగిస్తారు. విముక్తి కోసం రాజ్ నాయక్, రాజ్ నాయక్ పై పగ సాధించడం కోసం రత్న మహాదేవి ప్రేతాత్మలుగా జీవిస్తారు.
రత్నమహాదేవిని ప్రేమించిన రాజ్ నాయక్ ఆమెనను దక్కించుకోవడం కోసం మహారాజును, యువరాజును కూడా చంపేస్తాడు. దీంతో పగ తీరర్చుకునేందుకు యువరాణి రత్నమహాదేవి పథకం ప్రకారం రాజనాయక్ ను అంతమొందిస్తుంది. కానీ ఆ పోరాటంలో ఆమె కూడా ప్రాణాలు విడుస్తుంది. చనిపోతూ రాజనాయక్ ఆత్మకు శాంతి కలగకుండా ఎప్పటికీ భూలోకంలోనే ప్రేతాత్మగా ఉండిపోవాలని శపిస్తుంది. అప్పటి నుంచి తన శాప విముక్తి కోసం ఆత్మగా ఎదురు చూస్తుంటాడు రాజనాయక్.
కాష్మోరా(కార్తీ) తనకు తాను పెద్ద భూతవైద్యుడిగా చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తుంటాడు. అతనితో పాటు తల్లి, తండ్రి, చెల్లెలు చివరకు ఇంట్లో బామ్మ కూడా భూత వైద్యులుగా బిల్డప్ ఇస్తూ ప్రజల దగ్గరనుంచి డబ్బులు గుంజేస్తుంటారు. దెయ్యల మీద రిసెర్చ్ చేస్తున్న యామిని(శ్రీదివ్య) తన రిసెర్చ్ కు సాయం చేయమంటూ కాష్మోరా దగ్గర చేరుతుంది.
అదే సమయంలో ఓ రాజకీయ నాయకుణ్ని మోసం చేసి అతని అక్రమ సంపదనంతా తీసుకొని కుటుంబంతో సహా విదేశాలకు పారిపోవాలని ప్లాన్ చేస్తాడు కాష్మోరా. మరి అనుకున్నట్టుగా కాష్మోరా విదేశాలకు పారిపోయాడా..? కాష్మోరాకు రాజనాయక్ కు సంబంధం ఏంటి..? రాజనాయక్ కు శాపవిమోచనం అయ్యిందా..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
రాజనాయక్ గా, కాష్మోరాగా రెండు విభిన్న పాత్రల్లో నటించిన కార్తీ ఆకట్టుకున్నాడు. కాష్మోరాగా కామెడీ పండిస్తూనే రాజనాయక్ పాత్రలో క్రూరమైన విలన్ గా మెప్పించాడు. రెండు పాత్రలకు మంచి వేరియేషన్స్ చూపిస్తూ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచాడు. రత్నమహాదేవి పాత్రలో నయనతార మరోసారి సూపర్బ్ అనిపించింది. అందంగా కనిపిస్తూనే పరాక్రమవంతురాలైన యువరాణిగా ఆకట్టుకుంది. శ్రీదివ్య, వివేక్ లు తమ పరిధి మేరకు పాత్రకు న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణులు :
700 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనకు ప్రస్తుత పరిస్థితులను ముడిపెడుతూ రాసుకున్న కథతో దర్శకుడు గోకుల్ మంచి ఎంటర్‑టైనర్ ను తెరకెక్కించాడు. అక్కడక్కడా కొంత ఎందుకు సాగదీశారా అనిపించినా ముఖ్యంగా రాజనాయక్ పాత్ర తీరు ఆకట్టుకుంటుంది. హీరోయిజం, విలనిజం కలిసిన పాత్రగా రాజనాయక్ ను చూపించిన తీరు బాగుంది. హర్రర్ సినిమాకు కీలకమైన సంగీతం విషయంలో మరింత దృష్టి పెట్టాల్సింది. పాటలు ఏమాత్రం అలరించకపోగా నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకునే స్థాయిలోలేదు. ఎడిటింగ్ కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా లేదు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లెంగ్త్ ఇంకాస్త తగ్గించి ఉంటే బాగుండేది. సినిమా కోసం వేసి సెట్స్, కార్తీ మేకప్ సూపర్బ్ గా ఉన్నాయి. గ్రాఫిక్స్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
కార్తీ
ఫ్లాఫ్‑బ్యాక్ ఎపిసోడ్
మైనస్ పాయింట్స్ :
సంగీతం
ఎడిటింగ్
ఓవరాల్‑గా కాష్మోరా, హర్రర్ కామెడీ జోనర్ మూవీస్ లో విభిన్నమైన కమర్షియల్ ఎంటర్‑టైనర్..మంచి సినిమా
