కళ్లు పీకేస్తాం..ప్రముఖ సినీ రచయితకు బెదిరింపులు
భావ స్వేచ్చకు బహుమతి బెదిరింపులు అన్న పరిస్దితి కనపడుతోంది. మహారాష్ట్ర కర్ణిసేన వింగ్ అధ్యక్షుడు జీవన్ సింగ్ ప్రముఖ బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ను బెదిరించటం అంతటా చర్చనీయాంశంగా మారింది.
భావ స్వేచ్చకు బహుమతి బెదిరింపులు అన్న పరిస్దితి కనపడుతోంది. మహారాష్ట్ర కర్ణిసేన వింగ్ అధ్యక్షుడు జీవన్ సింగ్ ప్రముఖ బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ను బెదిరించటం అంతటా చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్ మహిళలు సాంప్రదాయంగా పాటిస్తున్న 'మేలిముసుగు (గూన్ఘాట్)' ధరించడంపై కూడా నిషేధం విధించాలని జావేద్ అక్తర్ డిమాండ్ చేశారు. బురఖాపై నిషేధం విధించాలని శివసేన అధికారిక పత్రిక సామ్నా తన సంపాదకీయంలో ప్రధాని మోడీని డిమాండ్ చేసిన నేపధ్యంలో గూన్ఘట్ వ్యవస్ధపై కూడా అటువంటి చర్యే తీసుకోవాలని జావేద్ అఖ్తర్ డిమాండ్ చేశారు.
అయితే ఆయన వ్యాఖ్యలపై కర్ణిసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మహారాష్ట్ర వింగ్ అధ్యక్షుడు జీవన్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మూడు రోజుల్లో క్షమాపణలు తెలపాలని జావేద్కు చెప్పాం. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పాం’ అని ఆయన అన్నారు.
అంతేకాదు మరోపక్క ఓ వీడియోలో.. ‘క్షమాపణలు చెప్పకపోతే.. మేం నీ కళ్లు పీకేస్తాం, నాలుక కోసేస్తాం. మీ ఇంట్లోకి వచ్చి చితకబాదుతాం’ అని జీవన్ రచయితను బెదిరించారు.
''భారత్లో బురఖాపై నిషేధం విధిస్తూ చట్టం తేవాలన్నది ఎవరో ఒకరి అభిప్రాయమైతే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాని రాజస్థాన్లో తుది దశ ఎన్నికలకు ముందే ఈ ప్రభుత్వం రాష్ట్రంలో 'గూన్ఘాట్'పై నిషేధం విధిచాలి'' అని అఖ్తర్ వ్యాఖ్యానించారు. శ్రీలంకలో ఈస్టర్ సండే నాడు జరిగిన దాడుల నేపధ్యంలో అన్ని రకాల ముఖ ముసుగులను నిషేధిస్తూ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఉత్తర్వులు జారీ చేసిన నేపధ్యంలో దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారత్లో కూడా నిషేధం విధించాలని సామ్నా సంపాదకీయం మోడీకి విజ్ఞప్తి చేసింది.