అరుణాకుమారి అనే మహిళా, ఉమాపతి అనే నిర్మాత కలిసి ఈ కుట్రకి ప్లాన్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఆదివారం బయటపడిన ఈ బాగోతంపై సోమవారం దర్శన్ ఘాటుగా స్పందించారు.
కన్నడ స్టార్ దర్శన్ పేరుతో భారీ మోసం ఇప్పుడు శాండల్వుడ్ని షాక్కి గురి చేస్తుంది. తన ఆస్తుల నకిలీ పత్రాలతో రూ.25కోట్లు లోన్ తీసుకునేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసి ఏకంగా దర్శనే షాక్కి గురి కావడం గమనార్హం. అరుణాకుమారి అనే మహిళా, ఉమాపతి అనే నిర్మాత కలిసి ఈ కుట్రకి ప్లాన్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఆదివారం బయటపడిన ఈ బాగోతంపై సోమవారం దర్శన్ ఘాటుగా స్పందించారు. నా ఆస్తులకు నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకుల నుంచి రూ. 25 కోట్లను పొందాలని చూసి, నాపై కుట్ర చేసినవారు ఎంతటి సన్నిహితులైనా వదిలిపెట్టేది లేదు. చట్టపరంగా పోరాడుతా అని ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ అరుణాకుమారి బెంగళూరులో మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. లోను విషయంలో నిర్మాత ఉమాపతి తనను వాడుకొని వదిలేశారని ఆరోపించారు. తాను ఎవరో తెలియదని ఆయన చెప్పడం నిజం కాదన్నారు. మార్చి 30 నుంచి అతనితో పరిచయం ఉందని ఆమె చెప్పారు. 'లోన్ విషయమై ఉమాపతిని కలిసిన మాట నిజం. అయితే లోన్ రాలేదు. దర్శన్ ఫాంహౌస్కు కూడా వెళ్లాను. దర్శన్–ఉమాపతి నడుమ ఏం జరిగిందో నాకు తెలియదు. వీరి ద్వారా నాకు ఇబ్బందులు వచ్చేలా ఉన్నాయి. నా కుటుంబం ఆత్మహత్య చేసుకొనే స్థితికి వచ్చింది. దయచేసి నన్ను బతకనివ్వండి' అని పేర్కొన్నారు.
తాను వాట్సప్లో హార్ట్ సింబల్ను ఉమాపతికి పంపడంపై చర్చ అవసరం లేదన్నారు. తన అన్నదమ్ముళ్లకు కూడా ఇలాంటి సింబల్ను పంపినట్లు తెలిపారు. నటుడు దర్శన్ తనపై ఆడియోను రిలీజ్ చేయటంపై నిర్మాత ఉమాపతి బెంగళూరులో తన ఇంట్లో స్పందించారు. `నేను ఎప్పుడూ దర్శన్ గురించి అనుచితంగా మాట్లాడలేదు. అరుణాకుమారి ఏప్రిల్ నుంచి తెలుసు. మే మూడో వారంలో దర్శన్ లోన్ విషయమై ఆమె, నేను మాట్లాడుకున్నాం. నేను దర్శన్ను దూరం చేసుకోను` అని చెప్పారు.
అంతకు ముందు మీడియా సమావేశంలో హీరో దర్శన్ మాట్లాడుతూ, జూన్ 6వ తేదిన నా మిత్రుడు, కన్నడ సినిమా నిర్మాత ఉమాపతి నాకు ఫోన్ చేసి రూ.25 కోట్ల బ్యాంకు రుణానికి మీరు ష్యూరిటీ సంతకం చేశారా? అని అడిగారు. నేను అయోమయానికి గురయ్యాను. ఏం జరిగిందని ఉమాపతిని అడగ్గా ఏమీ చెప్పలేదు. జూన్ 16వ తేదీన అరుణాకుమారి అనే మహిళను నిర్మాత ఉమాపతి నా ఇంటికి తీసుకొచ్చారు. ఆమె నా స్నేహితుల పేర్లను చెబుతూ కొన్ని దాఖలాలు చూపించారు. అందులో నా ఆధార్ నంబర్ తప్ప ఇంకేమీ లేదు. నేను పుట్టిన ప్రాంతం, జిల్లా పేరును ఆమె చెప్పగా అనుమానం పెరిగింది.
నేను ఆమె ముందే నాగు, హర్ష అనే నా మిత్రులకు కాల్ చేసి లోన్కు దరఖాస్తు పెట్టారా అని అడిగా, లేదు అని చెప్పారు. మరోసారి అరుణతో నందీష్, మదుకేష్ అనే ఇద్దరు వ్యక్తులు నా ఇంటికి వచ్చారు. లోన్ ఇవ్వడానికి ముందు మీ తోటను చూడాలని అడగ్గా, సరే అన్నాను. నా తరఫున లోన్ కోసం హర్ష రికార్డులు ఇచ్చారని అరుణ చెప్పారు. చివరకు నా స్నేహితులందరినీ ఆరా తీయగా ఎవరూ రుణం కోసం దరఖాస్తు చేయలేదని తెలిపారు. అరుణపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశా` అని దర్శన్ వెల్లడించారు.
