కమల్ పార్టీ ప్రకటన తేదీ ఖరారు, ఆరోజునే ఎందుకంటే..

జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శశికళ జైలుకెళ్లడం. పళని సీఎం కావడం, పన్నీర్ పళని ఏకమై దినకరన్ ను వేరుచేయడం, మైనారిటీ సర్కార్ అంటూ అన్నాడీఎంకే ప్రభుత్వంపై ప్రతిపక్షం విమర్శలు చేయడం ఇలా తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ రజినీ కాంత్ రాజకీయ అరంగేట్రంపై జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ దసరాకే వస్తుంది అనుకున్నా ఇంకా క్లారిటీ రాలేదు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రజినీ సంగతి అటుంచితే ఇప్పుడు తమిళ నటుడు కమల్ హాసన్ రాజకీయ రంగ ప్రవేశానికి ముహూర్తం ఖరారైంది. కొంతకాలం క్రితమే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన కమల్.. బుధవారం ఆయన అభిమానులతో భేటీ అయ్యారు. వాళ్ల ఒపీనియన్ తీసుకున్న తర్వాత పార్టీ విధి విధానాలు, సింబల్ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఇక కమల్ నేతృత్వంలో తమిళనాడులో మరో రాజకీయ పార్టీ రంగ ప్రవేశం చేస్తోంది. కమల్ ఇందుకోసం నవంబర్ ఏడో తేదీన ముహూర్తం ఖరారు చేశారు. నవంబర్ 7 కమల్ హాసన్ పుట్టిన రోజు. అదే రోజు పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. అభిమాన సంఘాలతో విస్తృతస్థాయి చర్చల అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పార్జీ జెండా, అజెండా తదితర అంశాలపై కమల్ వారితో చర్చలు జరిపారు.

జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ఓ విధమైన శూన్య వాతావరణం నెలకొంది. ఆ తర్వాత తలెత్తిన పరిణామాలు తమిళనాడు ప్రజల ఆగ్రహావేశాలకు కారణమయ్యాయి. పలువురు నటులు కూడా ఆ పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్ హాసన్ ఒకింత ముందుకెళ్లి పళనిస్వామి సర్కార్ ను భర్తరఫ్ చేయాలన్నారు. ఆయన మంత్రివర్గం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు.

కమల్ హాసన్ కామెంట్స్ నేపథ్యంలో బీజేపీలో చేరతారని భావించారు. అయితే తాను బీజేపీలో చేరేది లేదని స్పష్టం చేశారు కమల్. ఇక కమల్ కేరళ ముఖ్యమంత్రి పినరవి విజయన్ ను కలవడం, ఇటీవలే కేజ్రీవాల్ తో భేటీ అవడం కమల్ రాజకీయ రంగ ప్రవేశంపై ఉత్కంఠ రేపుతోంది. ఇక లెఫ్ట్ భావజాలానికి కమల్ ఆలోచనలు దగ్గరగా ఉంటాయని ఆయన సన్నిహితులు చెప్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయన లెఫ్ట్ పార్టీలతో కలసి పనిచేయవచ్చని అంచనా వేస్తున్నారు.

మరోవైపు కమల్ హాసన్ పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించగానే ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ దిల్లీ నుంచి చెన్నై వచ్చి ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఈ భేటీ తర్వాత తమిళనాడులో ఆప్ బాధ్యతలను కమల్ హాసన్ చూడవచ్చని వార్తలు వినిపించాయి. అయితే దీనిపై కమల్ హాసన్ కానీ, కేజ్రివాల్ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన తర్వాత రజనీని కూడా తనతో కలసి రావాలని కమల్ హాసన్ పిలుపునిచ్చారు. అయితే రజనీ మాత్రం ఔనని కానీ, కాదని కానీ చెప్పలేదు. పైగా.. రాజకీయాల్లో రాణించేందుకు పలుకుబడి, డబ్బుంటే సరిపోవని.. దానికి ఏం కావాలో కమల్ కు తెలుసనుకుంటున్నానని అన్నారు. రాజకీయాలపై రజనీ వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి.

ఇంతలోనే కమల్ హాసన్ తన అభిమాన సంఘాలతో భేటీ అవడం, పార్టీ జెండా, విధివిధానాలపై చర్చలు జరపడం, నవంబర్ ఏడో తేదీన పార్టీని ప్రకటించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిపోయాయి. ఇలా తమిళనాడులో మరో స్టార్ పొలిటికల్ ఎంట్రీ కన్ఫమ్ అయింది. ఇక కమల్ రాజకీయాలు ఎలా వుంటాయో.. చూడాలి.