నా గొంతుకలా మీరు.. మీ ముఖంలా నేనుః కమల్ హాసన్
ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కమల్ హాసన్, ఖుష్బు భావోద్వేగభరితమైన ట్వీట్లు చేశారు.
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనాతో పోరాడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ప్లాస్మా ట్రీట్మెంట్ జరుగుతుంది. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
ఇక ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆయనకు కుమారుడు ఎస్పీ చరణ్ ఆదివారం సాయంత్రం అప్డేట్ ఇచ్చారు. వైద్యులను గుర్తిస్తున్నట్టు, ట్రీట్మెంట్కి బాగా సహకరిస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని బాలు గొంతుక అయిన, విశ్వనటుడు కమల్ హాసన్ కోరుకున్నారు. కమల్ హాసన్కి తెలుగులో చాలా వరకు బాలసుబ్రమణ్యం వాయిస్ అందిస్తారని, డబ్బింగ్ చెబుతారనే విషయం తెలిసిందే. కమల్, నటి ఖుష్భు స్పందించి బాలు కోలుకోవాలని ట్వీట్లు చేశారు.
కమల్ హాసన్ స్పందిస్తూ, `అన్నయ్యా.. మీ కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం. నా గొంతుకలా మీరు.. మీ ముఖంలా నేను.. కొన్నిఏళ్ళపాటు జీవిస్తున్నాం. మళ్ళీ మీ గొంతుక పాటలతో వెలిగిపోవాలి. త్వరగా రండి అన్నయ్యా. మీ కోసం మేం ఎదురుచూస్తుంటాం` అని ట్వీట్ చేశారు.
మరోవైపు నటి ఖుష్బు సైతం స్పందిస్తూ, ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎస్పీబీగారు బాగమయ్యారు. రోజూ ఆయన పాటలు వినకుండా ఉండలేను. ఉదయం నుంచి పడుకోబోయే ముందు కూడా ఆయన పాటలు వింటాను. నా వరకు ఆయనో దేవుడు. నాలాగా కోట్లాది మంది అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తూ.. త్వరగా కోలుకుని వస్తారని ఎంతో నమ్మకంతో ఉన్నారు. మనందరి కోసం రావాలి. తిరిగి పాడాలి. ఆయన మరింత కాలం మన జీవితంలో ఉండాలి. ఆయన్ని హత్తుకోవాలి. సర్ మీ కోసం మేమంతా వెయిటింగ్. త్వరగా రండి, మీరు వస్తారు` అని ఎమోషనల్ ట్వీట్ చేశారు.