ఎన్టీఆర్ ఆర్ట్స్ లో తారక్ భాగస్వామ్యం.. క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్రామ్.. 2.0 చూస్తారంటూ కామెంట్
`ఎన్టీఆర్ 30`, `ఎన్టీఆర్ 31` చిత్రాల ప్రకటనలోనూ ఎన్టీఆర్ ఆర్ట్స్ భాగస్వామ్యమైన విషయం తెలిసిందే. తాజాగా మీడియా అడిగిన ప్రశ్నపై కళ్యాణ్రామ్ స్పందించారు.
ఎన్టీఆర్(NTR) నిర్మాతగా మారబోతున్నారని, ఆయన సొంతంగా ఓ ప్రొడక్షన్ పెట్టబోతున్నట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ బ్యానర్ పెట్టాలనే ఆలోచనని విరమించుకున్నారని, ఆయన అన్న కళ్యాణ్ రామ్(Kalyan Ram)తో కలిసి సినిమాలు నిర్మించబోతున్నట్టు మరో వార్త తెరపైకి వచ్చింది. ఇకపై తాను నటించే ప్రతి సినిమాకి కళ్యాణ్రామ్ స్థాపించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ భాగమవుతుందనే వార్తలూ ఊపందుకున్నాయి.
వాటికి ఊతమిస్తూ ఇటీవల ఎన్టీఆర్ ప్రకటించిన తన రెండు సినిమాలు `NTR30`, `NTR31` చిత్రాలలో ఎన్టీఆర్ ఆర్ట్స్(NTR Arts) భాగస్వామ్యమైన విషయం తెలిసిందే. నిర్మాణంలో భాగమైన నేపథ్యంలో తాజాగా మీడియా అడిగిన ప్రశ్నపై కళ్యాణ్రామ్ స్పందించారు. ఎన్టీఆర్ నిర్మాణంలో ఇన్వాల్వ్ కారని, ఆయన ప్రమేయం ఉండదన్నారు. అయితే ఒకే ఫ్యామిలీ, అన్నదమ్ములమన్నాక అన్నీ ఉంటాయని తెలిపారు. మేం ఏం చేసినా అది ఫ్యామిలీకి సంబంధించిందే అని, అందులో ప్రత్యేకత ఏం లేదన్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ని నిర్మాతగా పేరు వేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు.
బాలయ్యతో సినిమాపై స్పందిస్తూ , మా బ్యానర్లో బాబాయ్తో సినిమా చేయాలని ఉందని, కథ కూడా పంపించామని చెప్పారు. మాకు నచ్చింది ఆయనకు కూడా నచ్చాలని లేదని, దానికి టైమ్ పడుతుందని చెప్పారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, బాలయ్య కలిసి సినిమా చేయడంపై కళ్యాణ్రామ్ చెబుతూ, ఇలాంటి మల్టీస్టారర్ చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయన్నారు. అలాంటి సినిమాలు రావడం అంత ఈజీ కాదని చెప్పారు. ఎప్పుడో `మనం` వచ్చిందని, ఆ తర్వాత `ఆర్ఆర్ఆర్` వచ్చిందన్నారు. దానికి టైమ్ రావాలన్నారు.
మరోవైపు ఎన్టీఆర్ 30 సినిమాపై కళ్యాణ్రామ్ చెబుతూ, `ఆర్ఆర్ఆర్` సినిమా తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారని తెలిపారు. తారక్పై అంచనాలు పెరిగాయని నెక్ట్స్ చేయబోయే సినిమా ఆ అంచనాలను రీచ్ అయ్యేలా ఉండాలని తెలిపారు. ఆ స్థాయి కథ సిద్దం చేయాలంటే టైమ్ పడుతుందని, అన్నీ చూసుకోవాలని, అంత ఆశామాషి కాదన్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ దర్శకుడి నుంచి సరైన సమయంలో వస్తుందని, అప్పటి వరకు వెయిట్ చేయాలన్నారు.
ఇక `బింబిసార` చిత్రంలో రొమాన్స్ పలికించినట్టు తెలుస్తుందని అడిగిన ప్రశ్నకి కళ్యాణ్ రామ్ చెబుతూ, తాను రొమాంటిక్ సినిమాలు చేయనని, దానికి నేను సెట్ కానని తెలిపారు. ఇందులో ఓ సాంగ్ ఉంటుంది, కానీ అది రొమాంటిక్ సాంగ్ కాదని, రొమాన్స్ కి ఛాన్స్ లేదన్నారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఓ పాత్రలో రాజుగా, మరోపాత్రలో సాధారణ వ్యక్తిగా కనిపించనున్నారు. కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆగస్ట్ 5న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా బుధవారం కళ్యాణ్ రామ్ మీడియాతో ముచ్చటించారు.
`బింబిసార` నుంచి తనలో చాలా మార్పు వచ్చిందన్నారు. `ఎంత మంచి వాడువురా` చిత్రంతో తాను చాలా మారినట్టు పేర్కొన్నారు. కథల ఎంపికలో కొత్త పంథాని ఫాలో అవుతున్నానని, ఇకపై కళ్యాణ్ రామ్ 2.0(Kalyan Ram 2.0)ని చూడబోతున్నారని చెప్పారు. మరోవైపు `బింబిసార`కి రెండోపార్ట్ కూడా ఉందని చెప్పారు. మూడు, నాలుగు పార్ట్ లనేవి రిజల్ట్ తర్వాత ఆలోచిస్తామన్నారు. ఈ సినిమాకి కథని నమ్మి బడ్జెట్ పెట్టామని, ఇప్పుడు తాను హ్యాపీగానే ఉన్నట్టు చెప్పారు కళ్యాణ్రామ్. మరోవైపు నిర్మాణంలో ఇన్వాల్వ్ మెంట్ని తగ్గించి, యాక్టింగ్పై దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్టు పేర్కొన్నారు కళ్యాణ్ రామ్.