`భగవంత్ కేసరి` చిత్రంలో హీరోయిన్ కాజల్ని పట్టుకుని `ఆంటీ` అని పిలుస్తాడు బాలయ్య. ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ అవార్డుని సొంతం చేసుకుంది టాలీవుడ్ చందమామ.
తెలుగు తెర అందాల చందమామగా పాపులర్ అయ్యింది కాజల్. పెళ్లై, కొడుకు నీల్ కిచ్లుకి జన్మనిచ్చిన తర్వాత ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది. ఆమె బాలకృష్ణతో కలిసి `భగవంత్ కేసరి` చిత్రంలో నటించింది. ఈ మూవీ మంచి ఆదరణ పొందింది. ఇందులో కాత్యాయని పాత్రలో మెరిసింది కాజల్. సైకలాజిస్ట్ గా సందడి చేసింది. అదే సమయంలో సీనియర్ అయిన బాలయ్యతో కాసేపు లవ్ ట్రాక్ నడిపించింది. పులిహోర కలిపి నవ్వులపాలయ్యింది.
కాజల్ ని పట్టుకుని బాలకృష్ణ సినిమాలో `ఆంటీ` అని పిలిచిన విషయం తెలిసిందే. ఓ స్టార్ హీరోయిన్, సీనియర్ హీరోతో `ఆంటీ` అని పిలిపించుకోవడం మామూలు విషయం కాదు. ఆ సాహసం చేసిన కాజల్ గట్స్ కి అభినందనలు తెలియజేయాల్సిందే. అయితే ఇందులో కాజల్ పాత్రకి పెద్దగా ప్రయారిటీ లేదు. ఓ పాటకి, మూడు, నాలుగు సీన్లకే పరిమితమయ్యింది. దీంతో ఆమెది గెస్ట్ రోల్ అని కామెంట్ చేసిన వాళ్లున్నారు. సినిమా హిట్ కావడంతో అవన్నీ పక్కకెళ్లాయి.
ఇదిలా ఉంటే తాజాగా కాజల్ అవార్డుని సాధించింది. `భగవంత్ కేసరి` చిత్రంలోని కాత్యాయని పాత్రకిగానూ ఆమెకి ఇంటర్నేషన్ అవార్డు రావడం విశేషం. 16వ జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్-జేఐఎఫ్ఎఫ్ 2024 త్వరలో జరుగుతుంది. ఇందులో ఆమెకి ప్రత్యేకమైన గౌరవ పురస్కారం ప్రకటించారు నిర్వహకులు. ఫిబ్రవరి 9నుంచి 13 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది.
వీరితోపాటు `బింబిసార` చిత్రంలోని విశ్వనందన్ వర్మ పాత్రకిగానూ ప్రకాష్ రాజ్, `కార్తికేయ 2` చిత్రానికిగానూ డాక్టర్ ధన్వంత్రి వేద్పథక్ అనుపమ్ ఖేర్కి, `భగవంత్ కేసరి` చిత్రంలోని రాహుల్ సాంఘ్వి పాత్రకి అర్జున్ రాంపాల్కి అవార్డులను ప్రకటించారు. దీంతోపాటు `బింబిసార`కి రెండు అవార్డులు దక్కాయి.
ఇదిలా ఉంటే కాజల్కి అవార్డు రావడం పట్ల పలు విమర్శలు వస్తున్నాయి. అసలు ఇందులో ఆమె పాత్రకే పెద్దగా ప్రయారిటీ లేదు, కానీ అవార్డు ప్రకటించడమేంటనే ప్రశ్న, ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య, కాజల్ జంటగా నటించిన `భగవంత్ కేసరి` చిత్రంలో శ్రీలీల కూతురు పాత్ర పోషించింది. గతేడాది దసరాకి విడుదలైన ఈ మూవీ భారీ వసూళ్లని రాబట్టింది.
Read more: తన ఇంట్లోనే ఇద్దరు పద్మ విభూషణులు.. ఉపాసన ఎమోషనల్ పోస్ట్..
