రామ్ గోపాల్ వర్మకు చురకలంటించిన జొన్నవిత్తుల
- డ్రగ్స్ కేసు విచారణలో టాలీవుడ్ ను టార్గెట్ చేశారన్నది వర్మ వాదన
- చార్మి విచారణకు వెళ్లి వచ్చాక ఝాన్సీ లక్ష్మీబాయిలా కనిపించిందన్న వర్మ
- స్వాతంత్ర యోధురాలి పేరును చార్మికి ఆపాదించడమేంటని జొన్నవిత్తుల ఆగ్రహం
డ్రగ్స్ కేసుపై సంచలన కమెంట్స్ చేస్తూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా వార్తల్లో నిలుస్తున్నారు. మీడియా అంతా అకున్ సభర్వాల్ తో బాహుబలి 3 సినిమా తీస్తున్నారన్న వర్మ.. అదే స్పీడ్ లో అకున్ కు క్షమాపణలు కూడా చెప్పాడు. ఇక చార్మి విచారణ అనంతరం ఫేస్ బుక్ లో ఆసక్తికర కమెంట్స్ చేశాడు వర్మ.
చార్మి విచారణ కు వెళ్లి వస్తున్నప్పుడు ఝాన్సీ లక్ష్మిబాయిలా కనిపించిందన్నారు వర్మ. అంతే కాక తాను విచారణకు వెళ్తున్నప్పటికంటే వచ్చినప్పుడు మరింత అందంగా కనిపించిందని.. మేనిక్యూర్ చేయించుకున్నట్లుగా, మరింత మేకపే వేసుకున్నట్లుగా మెరిసిపోయిందని అసలు ఆమెనే సిట్ అధికారులను విచారించినట్లుగా కనిపించిందని వర్మ అభిప్రాయపడ్డాడు.
అయితే ఒక డ్రగ్స్ లాంటి కీలక కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తిని దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయురాలు ఝాన్సీ లక్ష్మి బాయితో పోల్చడం సరికాదని తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ సాహితీవేత్త, రచయిత జొన్నవిత్తుల అభిప్రాయపడ్డారు. విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తిని దేశభక్తురాలుతో పోల్చడం ఎంత మాత్రం సరికాదని జొన్నవిత్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్మ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాల్సిన అవసరం వుందని ఆయన డిమాండ్ చేశారు. మరి జొన్నవిత్తుల అభిప్రాయాన్ని వర్మ ఎలా తీసుకుంటాడో, దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి.