హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్ నటించిన ‘జోధా అక్బర్’ సినిమాలో చాలా పెద్ద తప్పులు జరిగాయి. అలాంటి 5 తప్పుల మీద ఓసారి లుక్కేద్దాం…
హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్ నటించిన ‘జోధా అక్బర్’ సినిమా విడుదలై 17 ఏళ్ళు అయ్యింది. 15 ఫిబ్రవరి 2008న దర్శకుడు ఆశుతోష్ గోవారికర్ ఈ సినిమాని విడుదల చేశారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సెమీ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, సినిమా బడ్జెట్ దాదాపు 55 కోట్ల రూపాయలు, ఇండియాలో నెట్ కలెక్షన్ 56.04 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్ 107.78 కోట్ల రూపాయలు. కానీ ఈ సినిమాలో కొన్ని చిన్న చిన్న తప్పులు ఉన్నాయని మీకు తెలుసా? అలాంటి 5 తప్పులను ఓసారి చూద్దాం...
1. మొఘల్ కాలంలో బంగాళాదుంప ఎక్కడి నుంచి వచ్చింది?
ఒక సీన్లో జోధా వంట చేయడానికి సిద్ధంగా ఉంది, ఆమె దగ్గర కూరగాయలు ఉన్నాయి. అందులో బంగాళాదుంప కూడా ఉంది. అక్బర్ పాలన 16వ శతాబ్దంలో జరిగింది, కానీ బంగాళాదుంప దక్షిణ అమెరికా నుంచి భారతదేశానికి 17వ శతాబ్దంలో వచ్చింది. అలాంటప్పుడు జోధా కూరగాయల బుట్టలో బంగాళాదుంప ఎలా వచ్చింది?
2. మొఘల్ కాలంలో స్టెయిన్లెస్ స్టీల్ వాడేవారా?
పెళ్లి తర్వాత జోధా మొదటిసారి ఆగ్రాకు వెళ్ళినప్పుడు, ఒక రాజపుత్ర పనిమనిషి అన్నం తెస్తుంది, దాన్ని జోధా కాలితో తన్ని పడేస్తుంది. మీరు గమనిస్తే, ఆ పాత్ర పనిమనిషి చేతిలో ఉన్నప్పుడు దాని కింద స్టెయిన్లెస్ స్టీల్ కనిపిస్తుంది, కానీ ఆ కాలంలో స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు వాడుకలో లేవు.
3. మహాం అంగా చెప్పిన పదం ఉనికే లేదు
ఒక సీన్లో మహాం అంగా వంటవాడు చేసిన వంటను టేస్ట్ చేసే విషయం గురించి మాట్లాడుతూ, అక్బర్, రాజ దర్బారు వారితో "ఖుద్ జహాన్ పనాహ్ ఇస్ బాత్ పర్ ఇన్కార్-ఎ-హర్ఫ్ నహీం ఉఠా సక్తే" అని అంటుంది. ఈ డైలాగ్లో వాడిన 'ఇన్కార్-ఎ-హర్ఫ్' అనే పదం ఉనికే లేదు. సరైన పదం 'హర్ఫ్-ఎ-ఇన్కార్', దాని అర్థం అభ్యంతరం.
4. అక్బర్ కాలంలో కొవ్వొత్తులు ఎక్కడి నుంచి వచ్చాయి?
సినిమాలో కొవ్వొత్తులు వెలుగుతున్నట్లు చూపించారు, కానీ నిజానికి ఆ కాలంలో కొవ్వొత్తులు ఉనికిలో లేవు. 1830లో మొదటిసారి కొవ్వొత్తులు తయారు చేశారు.
5. అక్బర్నామాలో జోధాబాయి పేరు ప్రస్తావనే లేదు
రిపోర్ట్స్ ప్రకారం, అతి పెద్ద తప్పు ఏంటంటే, సినిమాలో జోధాబాయి అనే పేరుతో అక్బర్ రాజపుత్ర రాణి అని చూపించడం. కానీ అక్బర్ అధికారిక జీవిత చరిత్ర అక్బర్నామా ప్రకారం, అక్బర్కు జోధాబాయి అనే రాజపుత్ర రాణి లేదు. అక్బర్ కొడుకు జహంగీర్ జీవిత చరిత్రలో మాత్రం తన తల్లి హిందూ రాజపుత్ర రాకుమారి అని, పెళ్లి తర్వాత ఆమె పేరు మరియం జమానీగా మార్చుకుందని ఉంది.
ఈ లాజిక్స్ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కేవలం చరిత్రకారులు మాత్రమే వీటిని గుర్తించగలరు. అయితే సినిమా బాగుంటే ఇవన్నీ లైట్, లేదంటే ప్రతిదీ నెగటివ్గానే మారుతుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు వస్తే ఈజీగా రెండువేల కోట్ల మూవీ అయ్యుండేది.