ప్రముఖ సినీ నటులు జీవిత,రాజశేఖర్ దంపతులకు రెండేళ్ళు జైలు శిక్ష విధిస్తూ.. నాంపల్లి కోర్ట్ సంచలన తీర్పు వెల్లడించారు. పరువు నష్టం కేసులోవారికి జైలు శిక్షపడింది.
పరువు నష్టం కేసులో సినీ నటులు రాజశేఖర్, జీవిత దంపతులకు జైలుశిక్ష విధిస్తూ నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ సాయిసుధ మంగళవారం సంచలన తీర్పు వెల్లడించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్పై రాజశేఖర్ దంపతులు మీడియా సమావేశంలో తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంటూ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 2011లో ఈ కేసు దాఖలు చేశారు.
జీవిత, రాజశేఖర్ దంపతులకు నాంపల్లి కోర్టు జైలు శిక్ష తో పాటు 5 వేల జరిమానా కూడా విధించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. చిరంజీవి బ్లడ్బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని 2011లో జీవిత, రాజశేఖర్ ఆరోపించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన సినీ నిర్మాత అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించారు. మెగాస్టార్ చిరంజీవి పేరుతో నడుస్తున్న సేవా కార్యక్రమాలపైన, ట్రస్టు పైనా అసత్య ఆరోపణలు చేశారంటూ పరువునష్టం దావా కేసు వేశారు. వారు చేసిన ఆరోపణలకు సబంధించిన వీడియోతో పాటు..మీడియాలో వచ్చిన కథనాలను కూడా జత చేసి కోర్టుకు సమర్పించారు.
ఇక సుదీర్ఘ విచారణ అనంతరం సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన కోర్టు.. రాజశేఖర్, జీవితకు రెండేండ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు ప్రకటించింది. ఇద్దరికీ ఏడాది జైలు శిక్షతోపాటు 5 వేల జరిమానా విధించింది. అయితే, జరిమానా చెల్లించడంతో... ఈ తీర్పుపై జిల్లా కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించడంతో వారిద్దరికి 10 చొప్పున పూచీకత్తులను సమర్పించగా కోర్టు పైకోర్టులో అప్పీలుకు అవకాశమిస్తూ బెయిలు మంజూరు చేసింది.
