`జాతిరత్నాలు` హీరో ఒకేసారి రెండు సినిమాలు.. అనుష్కతో మహేష్బాబు డైరెక్టర్.. త్రివిక్రమ్తోనూ..
`జాతిరత్నాలు` ఫేమ్ నవీన్ పొలిశెట్టి ఒకేసారి రెండు సినిమాలను ప్రకటించారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం అనుష్కతో సినిమాని, అలాగే సితార ప్రొడక్షన్లో మరో సినిమాని అనౌన్స్ చేశారు.
`జాతిరత్నాలు` ఫేమ్ నవీన్ పొలిశెట్టి బ్యాక్ టూ బ్యాక్ రెండు కామెడీ సినిమాలతో అలరించారు. `ఏజెంట్సాయి శ్రీనివాస్ ఆత్రేయ`, `జాతిరత్నాలు` సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయాలు సాధించాయి. ముఖ్యంగా `జాతిరత్నాలు` సినిమా యాభై కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టి ఇండస్ట్రీ వర్గాలను సైతం షాక్కి గురి చేసింది. ఆ తర్వాత ఆయన సినిమాలకు సంబంధించిన సస్పెన్స్ కొనసాగుతూ వస్తోంది. అనుష్కతో యూవీ క్రియేషన్లో ఓ సినిమా చేస్తున్నారని టాక్ వినిపించింది. ఆ తర్వాత దానికి సంబంధించిన అప్డేట్ రాకపోవడంతో ఆ సినిమా క్యాన్సిల్ అయ్యిందనే ప్రచారం జరిగింది.
కానీ ఇప్పుడు ఎట్టకేలకు సినిమాని ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. నేడు ఆదివారం నవీన్ పొలిశెట్టి బర్త్ డే. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఇందులో నవీన్ సింగర్ తరహాలో లుక్ ఇవ్వడం ఆకట్టుకుంది. ఇప్పటికే రెగ్యూలర్ షూటింగ్ ని స్టార్ట్ చేసుకుని శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. డిసెంబర్ నెలాఖరు నుంచి జాయిన్ కానున్నారు నవీన్. ఇందులో ప్రధాన పాత్రలో అనుష్క శెట్టి నటిస్తున్నారు. అనుష్క శెట్టి పుట్టిన రోజు సందర్భంగా ఆ మధ్య ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. ఇప్పుడు నవీన్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఈయన ఫస్ట్ లుక్ విడుదల చేసారు.
`సాహో`, `రాధే శ్యామ్` లాంటి భారీ సినిమాలతో దేశవ్యాప్తంగా యు.వి.క్రియేషన్స్కు అద్భుతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ సంస్థలో అనుష్క శెట్టి హ్యాట్రిక్ సినిమా చేయబోతున్నారు. ఇది అనుష్కకు 48వ సినిమా. అలాగే నవీన్ పొలిశెట్టికి హీరోగా మూడో సినిమా. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థలో రెండు సినిమాలు చేశారు అనుష్క శెట్టి. 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన `మిర్చి`.. 2018లో లేడీ ఓరియెంటెడ్ `భాగమతి సినిమాలను యు.వి.క్రియేషన్స్ నిర్మించారు. ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. `భాగమతి` సినిమా తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ ఒకేసారి విడుదలై అద్భుతమైన విజయం అందుకుంది. ఇందులో తనదైన నటనతో అందరినీ మెప్పించారు అనుష్క శెట్టి.
ఇప్పుడు మూడోసారి అనుష్క యు.వి.క్రియేషన్స్ కలిసి సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి మహేష్బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన నూతన దర్శకుడు కావడం విశేషం. ఈ సినిమాలో సరికొత్త లుక్లో కనిపిస్తున్నారు అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. త్వరలోనే దీనిపై దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారు. భాగమతి సినిమా తెలుగుతో పాటు సౌతిండియన్ భాషల్లో తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమాను కూడా మహేష్ బాబు అన్ని భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఎవరెవరు నటించబోతున్నారు అనే విషయంపై చిత్ర యూనిట్ త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనున్నారు. మరోవైపు నవీన్ పొలిశెట్టికి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ చెప్తున్నారు.
దీంతోపాటు నవీన్ మరో సినిమాకి కమిట్ అయ్యారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫర్చ్యూన్ 4సినిమాస్ పతాకలపై సూర్యదేవర నాగవంశీ, సౌజన్య శ్రీనివాస్(త్రివిక్రమ్ శ్రీనివాస్) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారీ చిత్రానికి. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. చైర్ లో కూర్చొని జల్సా రాజా తరహాలో నవీన్ పొలిశెట్టి లుక్ ఆకట్టుకుంటుంది.