మహేష్బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న `ఎస్ఎస్ఎంబీ28` ప్రాజెక్ట్ ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారింది. మహేష్, త్రివిక్రమ్ ల మధ్య విభేదాలు తలెత్తాయనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
సూపర్ స్టార్ మహేష్బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దాదాపు 13ఏళ్ల తర్వాత సినిమా చేస్తున్నారు. గతంలో `అతడు`, `ఖలేజా` వంటి సినిమాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి. `అతడు` హిట్ సినిమా. టీవీలో అంతకు మించిన బ్లాక్ బస్టర్. అత్యధికంగా టెలికాస్ట్ అయిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత చేసిన ప్రయోగం `ఖలేజా` తేడా కొట్టింది. ఈ సినిమా ఫ్లాప్ని మూటగట్టుకుంది. దీంతో మళ్లీ వీరిద్దరు కలిసి సినిమా చేయలేదు. వరుసగా త్రివిక్రమ్ బన్నీ, పవన్ కళ్యాణ్లతోనే సినిమాలు చేస్తూ వచ్చారు. మధ్యలో నితిన్తో ఒకటి, ఎన్టీఆర్తో మరోటి చేశారు.
ఇక మహేష్ బాబు అనేక కమర్షియల్ డైరెక్టర్స్ తో కమర్షియల్ సినిమాలు చేస్తూ తన స్టార్డమ్ని పెంచుకున్నారు. దాదాపు 12ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ అయ్యింది. `ఎస్ఎస్ఎంబీ28` పేరుతో ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్గా చేస్తుండగా, శ్రీలీల సెకండ్ హీరోయిన్. ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమాకి అనేక అవాంతరాలు వెంటాడుతున్నాయి. మహేష్ తన అమ్మా నాన్నలను కోల్పోవడంతో ఈ సినిమా పలు మార్లు వాయిదా పడుతూ వచ్చింది.
అయితే మొదట్నుంచి ఈ ప్రాజెక్ట్ విషయంలో మహేష్ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. సినిమా ప్రారంభంలో రూపొందించిన యాక్షన్ సీక్వెన్స్ లు ఆయనకు నచ్చలేదట. బాగా రాకపోవడంతో వాటిని క్యాన్సిల్ చేశారు. మరోసారి రూపొందించారు. యాక్షన్ డైరెక్టర్లని కూడా మార్చారట. అయినా సెట్ కాలేదట. అటు త్రివిక్రమ్ కూడా ఈ విషయంలో సాటిస్పైగా లేడని, అందుకే ఇప్పటి వరకు తీసిందంతా పక్కన పెట్టి మళ్లీ సినిమా షూటింగ్ చేయాల్సి వస్తుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ చెప్పినట్టుగా మహేష్ వినడం లేదట. మాటల మాంత్రికుడి స్టయిల్ సూపర్ స్టార్కి నచ్చడం లేదని సమాచారం. ఆ విషయంలోనే మహేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడని తెలుస్తుంది.
దీనికి కారణం పవన్ కళ్యాణ్ అని మరో వాదన వినిపిస్తుంది. త్రివిక్రమ్.. ఇప్పుడు పవన్ సినిమాలకు ఘోస్ట్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. స్క్రిప్ట్ నుంచి, షూటింగ్ వరకు అన్నీ ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారట. పవన్ ఇప్పుడు నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. `హరిహర వీరమల్లు`, `వినోదయ సీతం` రీమేక్, `ఉస్తాద్ భగత్ సింగ్`, `ఓజీ` చిత్రాలు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా `వినోదయ సీతం` రీమేక్, `ఓజీ` చిత్రాల విషయంలో త్రివిక్రమ్ ఎక్కువ కేర్ తీసుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ లను ఆయనే సెట్ చేశారు కూడా. అందుకే ఆ బాధ్యత తనే చూసుకుంటున్నారు. మిగిలిన రెండు సినిమాల్లోనూ పరోక్షంగా ఆయన ఇన్వాల్వ్ మెంటు ఉంటుందట.
దీని కారణంగా మహేష్ సినిమాపై ఫోకస్ పెట్టడం లేదని, సరిగా డీల్ చేయడం లేదని మహేష్ టీమ్ నుంచి వస్తోన్న ప్రధాన కంప్లెయింట్. తన సినిమా చేస్తూ మరో హీరో సినిమాలతో త్రివిక్రమ్ బిజీగా ఉండటం మహేష్కి నచ్చడం లేదని, దీంతో ఈగో సమస్యలు తలెత్తుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో మహేష్కి, త్రివిక్రమ్ కి మధ్య క్రియేటివ్ డిఫరెంట్స్ వస్తున్నాయని అంటున్నారు. ఇదే వీరి మధ్య విభేదాలకు దారితీస్తుందని ఫిల్మ్ నగర్ టాక్. ఇది సినిమా మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తుందని టాక్. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. అయితే అటు తివిక్రమ్కి, ఇటు మహేష్కి మధ్య నిర్మాతలు(హారికా అండ్ హాసిని, సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు) నలిగిపోతున్నారు. దీన్ని డీల్ చేయడం ఇప్పుడు నిర్మాతలకు కత్తిమీద సాములా మారిందని చెప్పొచ్చు. మరి వాళ్లు డీల్ చేసేదాన్ని బట్టి ఈ ప్రాజెక్ట్ ఉండటమా? క్యాన్సిల్ కావడమా? అనేది జరుగుతుందని చెప్పొచ్చు.
