సుమారు7 వేలకు పైగా పాటలకు సంగీతం అందించి, దాదాపు వెయ్యికి పైగా సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన ఘనత ఇళయరాజాది.
ప్రముఖ సంగీత దర్శకుడు మ్యాస్ట్రో ఇళయరాజా టైటిల్ పాత్రలో ధనుష్ నటించబోయే ప్యాన్ ఇండియా మూవీ ఇవాళ కమల్ హాసన్ ముఖ్య అతిథిగా చెన్నైలో ప్రారంభమయ్యింది. తెలుగు తమిళంతో పాటు అన్నిభాషల్లోనూ ఈ చిత్రం రానుంది. ఇప్పటిదాకా ఇండియన్ హిస్టరీ కేవలం ఒక సంగీత దర్శకుడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఎలాంటి సినిమా రాకపోవటం తో ఈ సినిమా ప్రత్యేకత సంతరించుకుంది. ఈ చిత్రం దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్. ధనుష్ హీరోగా జనవరిలో రిలీజైన కెప్టెన్ మిల్లర్ తీసింది ఈ డైరక్టరే. అరుణ్ మాథేశ్వరన్ తో ధనుష్ కు కెప్టెన్ మిల్లర్ సమయంలో మంచి అనుభందం ఏర్పడింది. దాంతో ఆ దర్శకుడునే ఈ సినిమాకు న్యాయం చేస్తారని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో ఒక హార్మొనీ పెట్టె తీసుకుని చెన్నై బ్రిడ్జ్ ల మీద తిరగడంతో మొదలుపెట్టి భారతీరాజాతో స్నేహం, కుటుంబ పోషణ కోసం రేయింబవళ్లు కష్టపడి ఇంత స్థాయికి చేరుకున్న వైనం అన్నీ చూపించబోతున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ చాలా పక్కాగా రాసుకున్నాకే తెరకెక్కిస్తున్నారట. అలాగే మాస్ట్రో స్వయంగా సంగీతం సమకూర్చుకోబోవటం మరో విశేషం. ఈ సినిమా కోసం 1980 నాటి వింటేజ్ మదరాసు సెట్లు వేయబోతున్నారని సమాచారం. ఈ సినిమాలో చాలా మంది తమిళ,తెలుగు హీరోలు గెస్ట్ రోల్స్ లో కనిపించనున్నారు. కనెక్ట్ మీడియా, మెర్క్యూరీ గ్రూప్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ను నిర్మించే ఈ చిత్రం ఈ రోజు మార్చి 20 న లాంచ్ చేసారు. 2025లో విడుదల చేయాలని చిత్రటీమ్ భావిస్తోంది.

సుమారు7 వేలకు పైగా పాటలకు సంగీతం అందించి, దాదాపు వెయ్యికి పైగా సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన ఘనత ఇళయరాజాది. అలాంటి దిగ్గజ సంగీత దర్శకుడి జీవిత విశేషాల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. ఈ చిత్రానికి ‘ఇసైజ్ఞాని’ అనే టైటిల్ని పెట్టినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన వెంటనే ఇళయరాజా, ధనుష్ కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి .ఇళయరాజా సినిమా కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి ఈ సినిమాలో వివరించనున్నారు. ఇళయరాజా పాత్రలో ధనుష్ని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇళయ రాజా సంగీత సేవలకు గుర్తింపుగా పద్మభూషణ్, పద్మవిభూషణ్, సంగీత నాటక అకడమిక్ అవార్డు వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంత చేసుకుకున్నారు. ఇక 50 ఏళ్లలో 20 వేలకు పైగా కచేరీలు పూర్తి చేసిన ఏకైక సంగీత విద్వాంసుడు ఇళయరాజా. రజనీ, కమల్, చిరంజీవి, మెహన్ బాబు, బాలకృష్ణ వంటి అగ్రహీరోలకు ఎన్నో హిట్ సాంగ్స్ అందించారు. గతంలో ఇళయరాజా బయోపిక్లో నటించేందుకు రజనీకాంత్ చర్చలు జరిపారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆయన స్థానంలో హీరో ధనుష్ వచ్చాడు.
