చెక్ బౌన్స్ కేసు ఎదుర్కొంటున్న హీరోయిన్ అమీషా పటేల్ న్యాయస్థానంలో లొంగిపోయారు. అనంతరం ఆమెకు షరతులతో కూడిన బెయిల్ లభించింది.
ప్రముఖ నిర్మాత, బిజినెస్ మాన్ అజయ్ కుమార్ వద్ద హీరోయిన్ అమీషా పటేల్ రూ. 2.5 కోట్లు ఓ ప్రాజెక్ట్ ఒప్పందంలో భాగంగా తీసుకున్నారు. ఆ సినిమా చేయకపోగా అమీషా పటేల్ ఆయనకు డబ్బులు తిరిగి ఇవ్వలేదు. ఒకసారి చెక్ జారీ చేసింది. అది కాస్తా బౌన్స్ కావడంతో అజయ్ కుమార్ ఆమెపై కేసు పెట్టారు. ఈ కేసులో రాంచీ సివిల్ కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో చేసేది లేక ఆమె కోర్టులో లొంగిపోయారు.
విచారణ అనంతరం కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆవరణలో ఆమె ముసుగుతో కనిపించారు. మీడియా కంట పడకుండా అక్కడి నుండి జారుకునే ప్రయత్నం చేశారు. తన మీద వచ్చిన చెక్ బౌన్స్ ఆరోపణలను అమీషా పటేల్ ఖండించడం విశేషం. 2000లో కహోనా ప్యార్ హై మూవీతో అమీషా పటేల్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. దర్శకుడు పూరి జగన్నాధ్ ఆమెను టాలీవుడ్ కి తెచ్చారు. రెండో చిత్రం బద్రి సూపర్ హిట్ కొట్టింది. అనంతరం మహేష్ కి జంటగా నాని, ఎన్టీఆర్ తో నరసింహుడు చిత్రాలు చేశారు. ఇవి పరాజయం పొందాయి.
మంచి ఆరంభం లభించినా అమీషా పటేల్ నిలదొక్కుకోలేక పోయింది. ప్రస్తుతం అడపాదడపా చిత్రాలు చేస్తుంది. మోడల్ గా కొనసాగుతుంది. తరచుగా సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తుంది.
