రిలీజ్ డేట్ లాక్ చేసిన రామ్-బోయపాటి... పెద్ద ప్లానే వేశారే!
రామ్ పోతినేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. దర్శకుడు బోయపాటి శ్రీను అదిరిపోయే న్యూస్ పంచుకున్నారు.

అఖండ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన బోయపాటి శ్రీను ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రకటించడం, దాన్ని పట్టాలెక్కించడం చకచకా జరిగిపోయాయి. రామ్ పోతినేనితో ఆయన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించారు. కెరీర్లో మొదటిసారి రామ్ పోతినేని-బోయపాటి శ్రీను కలిసి మూవీ చేస్తున్నారు. రామ్ ఎనర్జీకి తగ్గట్లుగా ఊర మాస్ యాక్షన్ సబ్జెక్టు ఎంపిక చేసినట్లు సమాచారం. గత ఏడాది రెగ్యులర్ షూటింగ్ మొదలు కాగా చాలా వరకు కంప్లీట్ చేశారు.
అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ విడుదల తేదీ ప్రకటించారు. దసరా కానుకగా అక్టోబర్ 20న మూవీ విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. దసరా బరిలో నిలుస్తున్న రామ్-బోయపాటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. రామ్ చిత్రానికి అద్భుతమైన రిలీజ్ డేట్ కుదరగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దుమ్మురేపే యాక్షన్ సన్నివేశాలు, ఊరమాస్ ఎలివేషన్స్ తో కూడిన పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఈ చిత్రానికి టైటిల్ నిర్ణయించాల్సి ఉంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ లో శ్రీనివాసా చిత్తూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మీద పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. వరుసగా రెండు ప్లాప్స్ చవిచూసిన రామ్.. దర్శకుడు బోయపాటి మీద చాలా ఆశలే పెట్టుకున్నారు.