గోపీచంద్ కొత్త సినిమా అప్డేట్.. `రామబాణం` వేయబోతున్నాడు..
గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో ఇప్పటికే రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. `లక్ష్యం`, `లౌక్యం` మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం మరోసారి కలిశారు. తాజాగా దీనికి అదిరిపోయే టైటిల్ ఖరారు చేశారు.
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటిస్తున్న ముప్పైవ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా టైటిల్ని ప్రకటించారు. శ్రీవాస్ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి `రామబాణం` అనే పవర్ఫుల్ టైటిల్ని ఖరారు చేశారు. సంక్రాంతి పండగ వేళ `రామబాణం` అనే టైటిల్ని ఖరారు చేయడం విశేషమనే చెప్పాలి. ఈ టైటిల్ని వెండితెరపై రాముడు పాత్రలు పోషించిన బాలకృష్ణ, ప్రభాస్ శనివారం విడుదల చేయడం విశేషం.
హ్యాట్రిక్ కోసం ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుంది. గతంలో గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో `లక్ష్యం`, `లౌక్యం` చిత్రాలు వచ్చి ఘన విజయం సాధించాయి. దీంతో వీరిద్దరికి హిట్ కాంబినేషన్గా నిలిచింది. తాజాగా ముచ్చటగా మూడో సారి వీరిద్దరు కలిసి చేస్తున్న సినిమాకి `రామబాణం` అనే టైటిల్ ఖరారు చేయడం ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. టైటిల్తోనే సినిమాపై బజ్ని క్రియేట్ చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టి జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి నిర్మిస్తున్నారు.ఇందులో హీరో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు అన్నగా, ఖుష్బూ వదిన గా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గోపీచంద్ కెరీర్లో 30వ సినిమాగా రాబోతోన్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం ముగింపు దశలో ఉన్నాయి.
నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న `అన్ స్టాపబుల్` షో ఎంతటి ప్రేక్షకాదరణ పొందు తోందన్న విషయం విదితమే. ఈ కార్యక్రమంలో నే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మాచో స్టార్ గోపీచంద్ లు పాల్గొన్న సందర్భంలో, అదికూడా వెండితెరపై శ్రీరాముడు పాత్రను సమున్నత రీతిలో అద్వితీయంగా పోషించిన బాలకృష్ణ ద్వారా చిత్రం పేరును `రామబాణం` గా ప్రకటించడం తమకెంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు చిత్ర దర్శకుడు శ్రీవాస్, నిర్మాతలు టి జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల
`ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు సామాజిక సందేశం కూడా మిళితమైన బలమైన కథాంశం ఉన్న చిత్రమిది. ఈ చిత్రంలో సరికొత్త గోపీచంద్ను చూడబోతున్నారు.‘లక్ష్యం, లౌక్యం వంటి విజయవంతమైన చిత్రాల తరువాత మళ్లీ గోపీచంద్, శ్రీవాస్ లు కలసి పనిచేయటంతో హ్యాట్రిక్ కొట్టబోతున్నారన్న అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఆ రెండు సినిమాలను మించేలా ఉండాలని ఈ సినిమా ని శ్రీవాస్ ఓ బాధ్యత తో తీర్చి దిద్దుతున్నాడు. ఇందులో వెనకాడకుండా చాలా గ్రాండ్ గా సమున్నత సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్తో నిర్మాణం చేస్తూ ఈ చిత్రం విజయంపై నమ్మకంతో ఉన్నార`ని తెలిపారు.
ఈ సినిమాకి కథని భూపతి రాజా, అందించగా,వెట్రి పళని స్వామి ఛాయాగ్రహణం, మిక్కీ జే మేయర్ సంగీతం, ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చనున్నాయి. 2023 వేసవి కానుకగా చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు చిత్ర నిర్మాతలు టి జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల.