శ్రీనువైట్లతో కొత్త సినిమా ఓపెనింగ్.. గోపీచంద్ రిస్క్ చేస్తున్నాడా?..
`రామబాణం`తో పరాజయాన్ని అందుకున్నారు గోపీచంద్. ఇప్పుడు మరో ఫ్లాఫ్ డైరెక్టర్తో సినిమా చేస్తున్నారు. వరుసగా పరజయాల్లో ఉన్న శ్రీను వైట్లతో సినిమా చేస్తున్నారు.

ఒకప్పుడు సూపర్ హిట్లు ఇచ్చిన దర్శకులు ఇప్పుడు ఫేడౌట్ అవుతున్నారు. నేటి ట్రెండ్కి తగ్గట్టుగా సినిమాలు చేయడంలో విఫలమవుతున్నారు. అలాంటి దర్శకుల్లో శ్రీను వైట్ల కూడా ఒకరు. ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. మహేష్బాబుతో `దూకుడు` లాంటి హిట్స్ అందించారు. `ఆనందం`, `సొంతం`, `వెంకీ`, `ఢీ`, `రెడీ`, `దూకుడు` వంటి హిట్ సినిమాలు తీసిన శ్రీను వైట్ల చాలా కాలంగా రాణించలేకపోతున్నారు.
ఆయన రూపొందించిన చాలా సినిమాలు పరాజయం చెందాయి. యాక్షన్ ఫ్యామిలీ డ్రామాలకు కేరాఫ్గా నిలిచే ఆయన కాలానికి అనుగుణంగా కొత్త కథలతో సినిమాలు చేసి మెప్పించలేకపోయారు. దీంతో ఇండస్ట్రీ నుంచి కొంత గ్యాప్ వచ్చింది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఇప్పుడు కమ్ బ్యాక్ అవుతున్నారు. మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నేడు ప్రారంభమైంది. రామానాయుడు స్టూడియోలో శనివారం ఈ కొత్త మూవీని ప్రారంభించారు.
ఈ సినిమాతో చిత్రాలయం స్టూడియోస్ అనే బ్యానర్ టాలీవుడ్లో లాంచ్ అవుతుంది. వేణు దోనేపూడి నిర్మాతగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు చేతుల మీదుగా ప్రారంభమైంది. అయితే శ్రీను వైట్ల తన గత చిత్రాల జోనర్లకి భిన్నమైన ఓ కొత్త జోనర్ చిత్రంతో రాబోతున్నారు. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునేందుకు హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ని చేస్తున్నారు. భారీ స్టార్ కాస్టింగ్గా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్టు చిత్ర బృందం తెలిపింది.
గోపీచంద్ 32గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు శ్రీనువైట్ల. మరోవైపు గోపీచంద్ నటించిన గత చిత్రం `రామబాణం` మెప్పించలేదు. ఆయన ఫెయిల్యూర్లో ఉన్నారు. ఈ క్రమంలో మరో ఫెయిల్యూర్ దర్శకుడితో గోపీచంద్ ప్రయోగం చేయడం పట్ల అభిమానుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది. గోపీచంద్ రిస్క్ చేస్తున్నాడా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ విమర్శలను దాటుకుని శ్రీనువైట్ల మెప్పిస్తాడా? కామెంట్లకి సమాధానం చెబుతాడా? అనేది చూడాలి.
ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ని ఈ నెలలోనే ప్రారంభించనున్నారట. లోకల్గా కొంత, విదేశాల్లో మరికొంత భాగం చిత్రీకరించనున్నారట. ఈ చిత్రానికి గోపీమోహన్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. కెవి గుహన్ కెమెరా వర్క్ చేస్తున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్, ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్ల వివరాలను త్వరలో వెల్లడించనుంది యూనిట్. ప్రస్తుతం గోపీచంద్ `భీమా` చిత్రంలో నటిస్తున్నారు. కె కె రాధామోహన్ నిర్మిస్తున్నారు. హర్ష దర్శకత్వం వహిస్తున్నారు.