గాయత్రి మూవీ రివ్యూ... మోహన్ బాబుకు ఈ ఏజ్ లో అవసరమా..
- టైటిల్ : గాయత్రి
- తారాగణం : మోహన్ బాబు, మంచు విష్ణు, శ్రియ, నిఖిలా విమల్, అనసూయ
- సంగీతం : తమన్ ఎస్
- దర్శకత్వం : మదన్
- నిర్మాత : మోహన్ బాబు
- ఆసియానెట్ రేటింగ్ : 2.75/5
కథ :
అనాథ అయిన దాసరి శివాజీ(మోహన్ బాబు, యువ శివాజీగా విష్ణు) రంగస్థల నటుడుగా స్థిరపడతాడు. ఓ ఊళ్లో నాటకాల కోసం వెళ్లి అక్కడే శారద(శ్రియ)ను చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరికీ కూతురు పుడుతుంది. అయితే అనారోగ్యం కారణంగా ఆసుపత్రి పాలైన శారద వైద్యం కోసం లక్ష రూపాయలు ఖర్చవుతుందని, ఏర్పాటు చేసుకోమని వైద్యులు చెప్తారు. ఆ డబ్బుకోసం నాటకాలను రియల్ లైఫ్ లో మొదలు పెడతాడు. అలా ఓ కేసులో నిందితునిలా వేషం కట్టి అతనికి బదులు జైలుకు వెళతాడు. అయితే రెండ్రోజులని చెప్పి 14 రోజులు రిమాండ్ లో వుంచటంతో... అతనికి భార్యా బిడ్డలు దూరమవుతారు. వాళ్ల కోసం వెతుకుతున్న శివాజీకి తన భార్య శారద చనిపోయిందని స్నేహితునిద్వారా తెలుస్తుంది. అయితే అతను శివాజీని కాపాడబోయి తనకు ఓ కూతురు వుందని చెప్తూ... చనిపోతాడు. అలా శివాజీ తనకు దూరమైన కూతురి కోసం ఎదురుచూస్తూ... కొంత మంది అనాథలను చేరదీసి “శారదా సదనం” అనే అనాథాశ్రమాన్ని నిర్వహిస్తుంటాడు. తన కూతురు ఏదో ఒక అనాథాశ్రమంలో ఉండే ఉంటుందన్న నమ్మకంతో అన్ని అనాథాశ్రమాలకు డబ్బు సాయం చేస్తుంటాడు.
శివాజీ వేషాల మీద అనుమానం వచ్చిన జర్నలిస్ట్ శ్రేష్ఠ (అనసూయ) అతడు చేసే పని ఎలాగైనా బయటపెట్టాలని ప్రయత్నిస్తుంటుంది. ఓ గొడవ కారణంగా శివాజీకి తన కూతురు ఎవరో తెలుస్తుంది. కూతుర్ని కలుసుకునే సమయానికి గాయత్రి పటేల్ (మోహన్ బాబు), శివాజీని కిడ్నాప్ చేస్తాడు. తన బదులుగా శివాజీని ఉరికంభం ఎక్కించాలని ప్లాన్ చేస్తాడు గాయత్రి పటేల్. తనకు బదులుగా శిక్ష అనుభవించడానికి గాయత్రి పటేల్.. శివాజీనే ఎంచుకోవటానికి కారణం ఏంటి? శివాజీ కూతురు గాయత్రికి, గాయత్రి పటేల్కు సంబంధం ఏంటి..? ఈ సమస్యల నుంచి శివాజీ ఎలా బయటపడ్డాడు..? చివరకు గాయత్రి పటేల్ ఏమయ్యాడు..? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ :
ఇప్పటి వరకు క్లాస్, హార్ట్ టచింగ్ సినిమాలు మాత్రమే చేసిన మదన్ తొలిసారిగా ఓ థ్రిలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మోహన్ బాబు లాంటి విలక్షణ నటుడికి తగ్గ కథా కథనాలతో ఆకట్టుకున్నాడు. చాలా కాలం తరువాత మోహన్ బాబు ను పూర్తి నెగెటివ్ క్యారెక్టర్ లో చూపించిన మదన్ అభిమానులు మెప్పించాడు. ఫస్ట్ హాఫ్లో వేగంగా కథ నడిపించిన దర్శకుడు. ద్వితీయార్థంలో మాత్రం కాస్త స్లో అయ్యాడు. ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్నా కథనం నెమ్మదించటం, అవసరం లేకపోయినా ఇరికించిన ఐటమ్ సాంగ్లు కాస్త ఇబ్బంది పెడతాయి. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ డైమండ్ రత్నబాబు డైలాగ్స్. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శివాజీ పాత్రతో పలికించిన డైలాగ్స్కు థియేటర్లలో విజిల్స్ పడుతున్నాయి. నటనలో సూపర్బ అనిపించిన కలెక్షన్ కింగ్ డ్యాన్స్ ల విషయంలో మాత్రం నిరాశపరిచాడు. తమన్ సంగీతమందించిన పాటలు పరవాలేదనిపించినా.. నేపథ్య సంగీతంతో మాత్రం మరోసారి మ్యాజిక్ చేశాడు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
మోహన్ బాబు రెండు విభిన్న పాత్రల్లో ఆకట్టుకున్నారు. నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలు చేయటంలో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. యాక్టింగ్ విషయంలో సూపర్బ్ అనిపించినా.. డ్యాన్స్ లు, ఫైట్స్ విషయంలో మాత్రం కాస్త ఇబ్బంది పడ్డారు. చిన్న పాత్రే అయిన విష్ణు కెరీర్ లో బెస్ట్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా విష్ణు నటించిన ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ తో కంటతడి పెట్టిస్తాయి. శ్రియ అందంగా, హుందాగా కనిపించింది. కీలకమైన గాయత్రి పాత్రలో నిఖిలా విమల్ మంచి నటన కనబరించింది. జర్నలిస్ట్ పాత్రలో అనసూయ పర్ఫెక్ట్గా సూట్ అయ్యింది. ఇతర పాత్రల్లో శివ ప్రసాద్, పోసాని కృష్ణ మురళీ, రాజా రవీంద్ర, బ్రహ్మానందం తమ పరిధి మేరకు మెప్పించారు. ముఖ్యంగా రాజకీయాలపై మోహన్ బాబు సెటైరికల్ డైలాగులు ఆకట్టుకుంటాయి. బీ కామ్ లో ఫిజిక్స్ చదివిన నేతలు రాజకీయాల్లోకొస్తున్నారని నేటి రాజకీయ నేతలపై పవర్ ఫుల్ పంచ్ లు విసిరారు మోహన్ బాబు.
చివరగా :
బంధాలు, అనుబంధాలకు విలువనిచ్చే ప్రేక్షకులకు నచ్చే గాయత్రి. మూవీలో డైలాగులు ఎక్కువయ్యాయి. కానీ మోహన్ బాబు అంటేనే డైలాగ్ కింగ్. ఇక ఆ జైల్ ఫైట్ సీన్ లాంటివి, అదీ డ్యుయల్ మోహన్ బాబు ఫైట్.. మోహన్ బాబు వర్సెస్ మోహన్ బాబు.. ఈ ఏజ్ లో అవసరమా ఆయనకీ కష్టాలు... కానీ సినిమా కోసం నటనపరంగా తన వంతు పూర్తిగా న్యాయం చేశారు.