నటీనటులు: బాలకృష్ణ.. శ్రియ.. హేమమాలిని.. కబీర్ బేడి.. శివరాజ్ కుమార్ తదితరులు సంగీతం: చిరంతన్ భట్‌ సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి మాటలు: సాయిమాధవ్ బుర్రా కళ: భూపేష్ భూపతి నిర్మాతలు: వై.రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సమర్పణ: బిబో శ్రీనివాస్‌ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి విడుదల తేదీ: 12-01-2017
కథ :
ఒకే రాజ్యం.. ఒకే యుద్ధం.. అఖండ భరత జాతి అని కలలుగన్న శాతవాహన చక్రవర్తి శాతకర్ణి (బాలకృష్ణ). దక్షిణ భారతంలో తిరుగులేని వీరునిగా కుంతల, కల్యాణ దుర్గం రాజ్యాలను హస్తగతం చేసుకుంటాడు. సౌరాష్ట్ర రాజ్యానికి చెందిన నహపాణుడి(కబీర్బేడీ)ని ఓడించి శకపురుషుడిగా అవతరిస్తాడు. ఉత్తరదక్షిణాదిలతో అఖండ భారతాన్ని ఏకఛత్రాధిపత్యం కిందకి తీసుకొస్తాడు. అయితే.. అలెగ్జాండర్ కలలుగన్న అఖండభారతాన్ని చేజిక్కించుకోవాలని గ్రీకు చక్రవర్తి డెమిత్రియస్ సింధు నుంచి పోరాటానికి దిగుతాడు. శాతకర్ణిపై విషప్రయోగానికి పూనుకుంటాడు. మరి డెమిత్రయస్ని శాతకర్ణి ఎలా ఓడించాడు? తాను కలలుగన్న అఖండభారతావనిని ఎలా సృష్టించాడు? అన్నది స్టోరీ.
శాతకర్ణి సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి యుద్ధమే మార్గమని నమ్మి, కుటుంబాన్ని సైతం వదిలిపెట్టి వరుసగా అన్ని రాజ్యాలను జయించి అఖండ భారతాన్ని నిర్మిస్తాడు. ఆ క్రమంలో అతనికి, అతని భార్యకి మధ్య దూరం ఏర్పడుతుంది. అదే సమయానికి ఒక విదేశీ శత్రువు వలన తాను నిర్మించిన అఖండ భారతానికి ముప్పు వాటిల్లుతుందని భావించి భవిషత్తు కోసం రాజ్యానికి బలమైన పునాదులు వేయాలని చరిత్రలో చివరి యుద్దానికి సిద్దమవుతాడు.
అలాంటి శాతకర్ణికి జైత్రయాత్ర సమయంలో తన భార్యతో ఎలాంటి విబేధాలు ఏర్పడ్డాయి ? అతని తల్లి అతన్ని ఎలా వెన్నుతట్టి ముందుకు నడిపింది ? శాతకర్ణి జైత్రయాత్ర ఎలా సాగింది ? శాతకర్ణి అఖండ భారతాన్ని ఎలా నిర్మించాడు ? విదేశీ శత్రువుల బారి నుండి దాన్ని ఎలా కాపాడాడు ? అన్నది తెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
సినిమాలోని ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవలసింది దర్శకుడు క్రిష్ ఎంచుకున్న నైపథ్యం గురించి. తెలుగు జాతి పౌరుషాన్ని, గొప్పతనాన్ని చాటిన గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత కథ ప్రేక్షకుడికి మొదట్లోనే ఎమోషనల్ గా బాగా కనెక్టవుతుంది. ఇక యువరత్న బాలకృష్ణ ఆ పాత్రను పోషించడంతో అది ప్రేక్షకులకు ఇంకా బాగా నచ్చుతుంది. మొదటి నుండి పౌరాణిక, చారిత్రక పాత్రలకు ప్రాణం పోసే బాలయ్య శాతకర్ణి పాత్రలోని రాజసం, పౌరుషం ప్రదర్శించడంలో నూటికి నూరు పాళ్ళు విజయం సాధించి ఆకట్టుకున్నాడు.
శాతకర్ణి పాత్రకు సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగులు చాలా ఉన్నతంగా ఉన్నాయి. వాటిని బాలయ్య పలికించిన తీరు సినిమా మొత్తానికి మేజర్ హైలెట్ ముఖ్యంగా ఆయన అభిమానులకైతే పండుగనే వీనుల విందనే చెప్పొచ్చు. ఇక దర్శకుడు క్రిష్ శాతకర్ణి జీవితం నుండి మూడు ప్రధాన అంశాలు అతనికి, అతని తల్లికి మధ్య ఉన్న అనుబంధం, శాతకర్ణి పట్ల అతని భార్య దృక్పథం, అఖండ భారతాన్ని శాతకర్ణి సాదించాలనుకోవడంలో అతని అంతరంగం, అనుసరించిన కఠిన మార్గాలు, కొడుకును పణంగా పెట్టి అతను పడిన కష్టాలు వంటివి చూపడం నచ్చింది.
ఇక కథలో బాలకృష్ణ భార్య వశిష్టాదేవిగా నటించిన శ్రియ నటన బాగుంది. బాలకృష్ణకు, ఆమెకు మధ్య ఫస్టాఫ్, సెకండాఫ్లో నడిచిన కొన్ని ఏమోషనల్ సన్నివేశాలు బలంగా కనిపించాయి. అలాగే గౌతమి బాలాశ్రీ పాత్రలో హేమామాలిని నటన సినిమాకి మరో పెద్ద అసెట్.
మైనస్ పాయింట్స్ :
మైనస్ పాయింట్స్ విషయానికొస్తే చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన సినిమా కాబట్టి అందులో బలమైన, ఉత్కంఠ భరితమైన కథనం ఉంటుందనే ఉత్సాహం సినిమా మొదలవడానికి ముందు, మొదలైన కాసేపటి వరకు ఉంది కానీ ఆ తరువాత ఎగిరిపోయింది. ఇలాంటి చారిత్రిక అంశాలతో తెరకెక్కిన సినిమా నుండి వినోదం పంచలేరు కాబట్టి ఉత్కంఠనైనా కలిగించాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల్లో చాలా వరకూ కనిపించలేదు. రాజులు, రాజ్యాలు, వీరుల కథలు చెప్పేటప్పుడు ప్రేక్షకుడు కోరుకునేది, వాస్తవంగా అతనికి అత్యంత ఉత్కంఠను కలిగించే అంశాల్లో ప్రధానమైనది యుద్దాలే. అలాంటి యుద్ధాలే తేలిపోవడంతో ఫస్టాఫ్, సెకండాఫ్ లు పూర్తి స్థాయి విజయాన్ని సాధించలేకపోయాయి.
ఇక సినిమా క్లైమాక్స్ లో ఒక్క బాలకృష్ణ మినహా చెప్పుకోదగ్గ విశేషమేమీ కనబడలేదు. యుద్ధ సన్నివేశాల్ని ఇంకాస్త వివరంగా తెరకెక్కించి ఉండాల్సింది. అలాగే క్రిష్ నుండి ఆశించే నాటకీయ కథనం ఇందులో చాలా వరకూ కనిపించలేదు. దాంతో సినిమాపై క్రిష్ మార్క్ బలంగా కనిపించలేదు.
సాంకేతిక నిపుణులు :
దర్శకుడు క్రిష్ గురించి మాట్లాడుకుంటే శాతకర్ణి జీవితం నుండి అతి ముఖ్యమైన అంశాలను తీసుకుని సినిమాగా చేసిన ఆయన ప్రయత్నం మెచ్చుకోదగ్గది పైగా చాలా వరకు సక్సెస్ అయింది కానీ అందులో తన ట్రేడ్ మార్క్ డ్రామా, ఎమోషన్ కంటెంట్, ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల్లో మిస్సయ్యాయి. రచయిత సాయిమాధవ్ బుర్రా రాసిన డైలాగులు అద్భుతంగా ఉంది సినిమాకి కొత్త హుందాతనాన్ని తెచ్చాయి. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకు చారిత్రకమైన పరమైన లుక్ తీసుకురావడంలో సక్సెస్ అయింది. ఇక చిరంతన్ భట్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నా యుద్ధ సన్నివేశాల్లో తీవ్రతను మాత్రం అది పెంచలేకపోయింది. రచయిత సీతారామ శాస్త్రి పాటలకిచ్చిన సాహిత్యం ఉన్నతంగా ఉంది. బిబో శ్రీనివాస్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి.
చివరగా : చరిత్రను, క్రిష్ సినిమాల్ని, బాలకృష్ణను ఇష్టపడే వాళ్లకు నచ్చుతుంది.
