శిల్పాశెట్టి, ఆమె తల్లిపై ఛీటింగ్ కేసు.. కోట్ల రూపాయల మోసం..
శిల్పాశెట్టికి మరో షాక్ తగిలింది. ఆమెపై, ఆమె తల్లి సునందపై లక్నోలోని రెండు పోలీస్ స్టేషన్లలో ఛీటింగ్ కేసు నమోదైంది.
శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రా పోర్నోగ్రఫీ కేసు బాలీవుడ్ని ఉలిక్కి పడేలా చేసింది. ఈ కేసులో రాజ్కుంద్రాని ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈనేపథ్యంలో శిల్పాశెట్టికి మరో షాక్ తగిలింది. ఆమెపై, ఆమె తల్లి సునందపై లక్నోలోని రెండు పోలీస్ స్టేషన్లలో ఛీటింగ్ కేసు నమోదైంది. శిల్పా, ఆమె తల్లి తమ వద్ద కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారంటూ జ్యోత్స్య చౌహాన్, రోహిత్ వీర్ సింగ్ అనే ఇద్దరు హజరత్ గంజ్, విభూతిఖండ్ పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ నమోదైంది.
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి విచారణ చేపడుతున్నారు. ఈ రెండు బృందాలకు డీసీపీ సంజీవ్ సుమన్ అధికారిగా ఉన్నారు. ఇప్పటికే శిల్పాని, ఆమె తల్లిని విచారించేందుకు డీసీపీతో సహ ఓ బృందం ముంబయికి చేరుకున్నట్టు సమాచారం. ఈ కేసులో పోలీసుల కథనం ప్రకారం.. శిల్పాశెట్టి అయోసిస్ వెల్నెస్ అండ్ స్పా పేరుతో ఫిటినెస్ సెంటర్ను నడిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఆమె చైర్మన్గా ఉండగా, ఆమె తల్లి సునంద డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలో ఈ ఫిట్నెస్ సెంటర్ మరో బ్రాంచ్ను లక్నోలో ప్రారంభించేందుకు జ్యోత్స్న చౌహాన్, రోహిత్ వీర్ సింగ్ అనే ఇద్దరికి వారు ఫ్రాంచెజ్ ఇచ్చి, సెంటర్ను ప్రారంభించేందుకు వారి నుంచి కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఆ తర్వాత దీనిపై వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో శిల్పా, ఆమె తల్లి సునందలు తమ వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ పోలీసులను ఆశ్రయించారు. డీసీసీ సంజీవ్ సుమన్ మాట్లాడుతూ.. ఈ విషయం ఉన్నత స్థాయికి చేరిందని, ఈ కేసులో పోలీసులు అన్ని అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారని వెల్లడించారు. శిల్పాశెట్టి, ఆమె తల్లిని విచారించబోతున్నట్టు వెల్లడించారు.