బుల్లితెరపై మొట్టమొదట తెలుగు వారందరికి వార్తలు వినిపించిన న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మరణించారు. బుల్లితెర, మీడియా రంగంలో ఇది అత్యంత విషాదకర వార్త.

బుల్లితెరపై మొట్టమొదట తెలుగు వారందరికి వార్తలు వినిపించిన న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మరణించారు. బుల్లితెర, మీడియా రంగంలో ఇది అత్యంత విషాదకర వార్త. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న శాంతి స్వరూప్ తొలి తెలుగు న్యూస్ రీడర్ గా ఎదిగారు. 

రెండు రోజుల క్రితం శాంతి స్వరూప్ గుండెపోటు కారణంగా హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స పొందుతూ నేడు శుక్రవారం మరణించారు. ఆయన మృతితో బుల్లితెర, సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. 

శాంతి స్వరూప్ పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే. శాంతిస్వరూప్‌ దూరదర్శన్‌లో వార్తలు చదవిన తొలి తెలుగు యాంకర్‌. తెలుగు ప్రజలకు వార్తలు చెప్పిన మొట్టమొదటి వ్యక్తి. ఇప్పటి న్యూస్‌ రీడర్లు ఎందరికీ ఆయన గురువు, మార్గదర్శకులు. ప్రాంప్టర్‌ లేని ఆ రోజుల్లో తప్పులు లేకుండా వార్తలు చదవేవారు. 2011లో ఆయన రిటైరయ్యారు.

శాంతి స్వరూప్ కి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. శాంతి స్వరూప్ 1983 నవంబర్ 14 నుంచి దూరదర్శన్ లో వార్తలు చదవడం ప్రారంభించారు. ఆయనకు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు కూడా దక్కింది. చిన్నతనంలోనే శాంతిస్వరూప్ తండ్రిని కోల్పోయారు. ఆయన సోదరుడు శాంతి స్వరూప్ ని పెంచి పెద్దచేశారు.