#Yashoda:'యశోద' 5 కోట్ల దావా వివాదం, .. ఆ విధంగా ముగిసింది
‘యశోద’ సినిమాలోని ‘ఈవా’ అనే పేరుని తొలగించామని, ఓటీటీ, శాటిలైట్ లో ఈ సినిమాని ప్రదర్శించినప్పుడు ‘ఈవా’ అనే పేరు కనిపించదని నిర్మాత స్పష్టమైన హామీ ఇచ్చారు.
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ''యశోద''. సరోగసి బ్యాక్ డ్రాప్తో రూపొంది థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోన్న యశోద మూవీ ఓటీటీ విడుదలకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 19 వరకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్లో యశోద చిత్రాన్ని విడుదల చేయవద్దని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది.
అందుకు కారణం ....యశోద సినిమాలో ఇవా హస్పిటల్(EVA hospital) పేరు దెబ్బతినేలా చూపించారని ఆ ఆసుపత్రి యాజమాన్యం కోర్టులో పిటిషన్ వేసింది. సినిమాలో అలా చూపించడం వల్ల ఆసుపత్రి పరపతి దెబ్బతిందని అందులో పేర్కొంది. ఈ సినిమా ఓటీటీ విడుదలను ఆపాలని కోరింది. దీంతో కోర్టు యశోద నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 19 వరకు ఓటీటీలో ప్రదర్శించకూడదని ఆదేశాలు జారీ చేసింది.
యశోద సినిమాలో తమ ప్రతిష్టకు నష్టం కలిగించే సన్నివేశాలు ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలని, నిర్మాత రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోర్టుకెక్కారు. ఇప్పుడు ఈ ఇష్యూ ని నిర్మాత చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొన్నారు. ‘యశోద’ సినిమాలోని ‘ఈవా’ అనే పేరుని తొలగించామని, ఓటీటీ, శాటిలైట్ లో ఈ సినిమాని ప్రదర్శించినప్పుడు ‘ఈవా’ అనే పేరు కనిపించదని నిర్మాత స్పష్టమైన హామీ ఇచ్చారు.
తాజాగా ఈ అంశం మీద ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాలో ఈవా అనే పేరు ఒక కాన్సెప్ట్ ప్రకారం పెట్టామని, వేరొకరి మనోభావాలు దెబ్బ తీయడానికి కాదని పేర్కొన్నారు. ఈవా వారిని కలిసి నేను జరిగింది చెప్పానని ఇకమీదట ఫ్యూచర్లో ఈవా అనే పదం యశోద సినిమాలో కనపడదని ఆయన పేర్కొన్నారు. మా నిర్ణయాన్ని ఈవా సంస్థ కూడా అంగీకరించిందని ఈ సమస్య ఇంతటితో పరిష్కారం అయిందని అన్నారు. ఇది తెలియక జరిగిన చిన్న పొరపాటు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ సందర్భంగా ఈవా హాస్పిటల్ ఎండి మోహన్ రావు మాట్లాడుతూ యశోద సినిమాలో మా హాస్పిటల్ పేరు వాడడంతో నిజంగానే మేము హర్ట్ అయ్యాము, అయితే నిర్మాత దృష్టికి ఈ విషయం వెళ్లిన వెంటనే ఆయన చాలా త్వరగా సమస్యను క్లియర్ చేశారని అన్నారు.
దీంతో సమస్య పరిష్కారమైందని అన్నారు డాక్టర్స్ అందరూ కూడా ప్రాణాలు కాపాడాలని కోరుకుంటారని పేర్కొన్న ఆయన సినిమా వాళ్లు కూడా మా ప్రొఫెషన్ గౌరవించాలని అన్నారు. ఇప్పటికీ ఎవరికైనా ఏదైనా జరిగితే ఠాగూర్ సినిమా లాగా జరిగింది అంటారని ఎందుకంటే సినిమా అనేది చాలా బలమైన మాధ్యమం అని అన్నారు. ఇక ఆ రోజు ఐదు కోట్లకు డ్యామేజ్ సూట్ వేశారు కదా?' అని కొందరు ప్రశ్నించారన్న ఆయన అప్పుడు కూడా చెప్పానని, డబ్బుల కోసం కేసు వేయలేదని అన్నారు. అసలు మా బాధ విలువ చెప్పాలని చేశామని, ఈవా ఐవీఎఫ్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా చూడటం మా ఉద్దేశమని అన్నారు.
మొన్న సాయంత్రం నాకు సినిమా చూపించారని, అందులో ఈవా పేరుకు సంబంధించినవి అన్నీ తొలగించడంతో నిన్న కోర్టుకు వెళ్లి 'యశోద' నిర్మాత చేసిన మార్పులతో సంతృప్తిగా ఉన్నామని చెప్పామని అన్నారు. అయితే ఈ కేసును ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపామని, వెంటనే కోర్టు ఆమోదించిందని, ఇరు వర్గాల అంగీకారంతో కేసు విత్ డ్రా అయ్యిందని వెల్లడించారు. ఇక ఇంతటితో ఈ సమస్య సమసి పోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.