తిరుమలలో సందీప్ రెడ్డి వంగ... స్పిరిట్ మూవీ అప్డేట్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్!
దర్శకుడు సందీప్ రెడ్డి వంగ యానిమల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన నెక్స్ట్ స్పిరిట్ మూవీ చేస్తున్న క్రమంలో అప్డేట్ ఇచ్చారు.
సందీప్ రెడ్డి వంగ హ్యాట్రిక్ కొట్టాడు. ఆయన తెరకెక్కించిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. యానిమల్ అయితే ఏకంగా రూ. 900 కోట్ల వసూళ్లు రాబట్టింది. రన్బీర్ కపూర్ కెరీర్లో అతి పెద్ద విజయం నమోదు చేసింది. యానిమల్ మూవీపై అనేక విమర్శలు వినిపించాయి. అయినప్పటికీ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. విశేషంగా ఆదరించారు. యానిమల్ సక్సెస్ తో జోరు మీదున్న సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ మూవీకి సిద్ధం అవుతున్నాడు.
కాగా చాలా కాలం క్రితమే ప్రభాస్ హీరోగా స్పిరిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ పై ఆయన లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. సందీప్ రెడ్డి వంగ తిరుమలకు వచ్చారు. తలనీలాలు ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మీ తదుపరి చిత్రం ఏమిటనగా... స్పిరిట్ అని సమాధానం చెప్పారు.
యానిమల్ కి సీక్వెల్ గా యానిమల్ పార్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికంటే ముందు ప్రభాస్ తో స్పిరిట్ చేస్తున్నట్లు సందీప్ రెడ్డి లేటెస్ట్ కామెంట్స్ తో అర్థం అయ్యింది. ఇక స్పిరిట్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ అని సందీప్ రెడ్డి వంగ గతంలో చెప్పాడు. సందీప్ రెడ్డి చిత్రాల్లో పాత్రలు చాలా ఇంటెన్స్ గా ఉంటాయి. మరి ప్రభాస్ ని ఆయన ఎలా చూపిస్తారో చూడాలి. స్పిరిట్ మూవీపై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్ లో ఆసక్తి నెలకొని ఉంది.
ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2829 AD , రాజా సాబ్ చిత్రాలు చేస్తున్నారు. ఇవి రెండు చిత్రీకరణ దశలో ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతున్న కల్కి మే 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే వాయిదా పడవచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక మారుతి తెరకెక్కిస్తున్న రాజా సాబ్ భిన్నమైన కథ అని తెలుస్తుంది.