ట్రైలర్‌లో చూపించినట్టుగానే రూ.17 కోట్ల ఇంజెక్షన్ అనేది ఉంటుందా లేదా సినిమా కోసం రాసుకున్న ఫిక్షనల్ పాయింటా అని మీడియా నుంచి దర్శకుడు శైలేష్‌కు ప్రశ్న ఎదురయ్యింది. 

విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ 75వ చిత్రం ‘సైంధవ్’. సైంధవ్ జనవరి 13, 2024న అన్ని దక్షిణ భారత భాషలు, హిందీలో విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రతి అప్‌డేట్ కోసం యూనిట్ ఒక ఈవెంట్‌ను నిర్వహిస్తోంది.  నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ తాజాగా రిలీజైంది.   కథేంటో ట్రైలర్‌లోనే తెలిసిపోయింది. అయితే ట్రైలర్ చూసిన వారికి ఓ డౌట్ వచ్చింది. దాన్ని మీడియా వారు దర్శకుడుని అడిగితే నిజమే అని తేల్చారు. అదేంటో చూద్దాం. 

ఇక ట్రైలర్‌లో హీరో హ్యాపీగా ఫ్యామిలీతో గడుపుతుంటాడు. సడెన్‌గా తన కూతురు ‘స్పెనల్‌ మాస్క్యూలర్‌ ఎట్రోఫి’ అనే అరుదైన వ్యాధికి గురవుతుంది. ఈ వ్యాధి నుంచి బయటపడాలంటే రూ. 17 కోట్ల విలువైన ఇంజెక్షన్‌ పాపకివ్వాలి అని వైద్యులు చెబుతారు. తన పాపకివ్వాల్సిన ఖరీదైన ఇంజెక్షన్‌ కోసం హీరో విలన్‌తో తలపడతాడు. పెళ్లికి ముందుహీరో గతమేంటి? హీరోకి, విలన్‌కి మధ్య ఉన్న గొడవలేంటి? చివరకి తన కూతురి ప్రాణాల్ని హీరో రక్షించుకున్నాడా లేదా? వంటి విషయాలపై ఆసక్తి పెంచేలా ట్రైలర్‌ ఉంది. అయితే ఈ ట్రైలర్‌లో యాక్షన్‌ సీన్స్‌ ఎవరూ ఊహించనివిధంగా ఉన్నాయి.   ట్రైలర్‌లో చూపించినట్టుగానే రూ.17 కోట్ల ఇంజెక్షన్ అనేది ఉంటుందా లేదా సినిమా కోసం రాసుకున్న ఫిక్షనల్ పాయింటా అని మీడియా నుంచి దర్శకుడు శైలేష్‌కు ప్రశ్న ఎదురయ్యింది. దీంతో ఈ రూ.17 కోట్ల ఇంజెక్షన్ ఐడియా అనేది తనకు ఎలా వచ్చిందో చెప్పుకొచ్చారు  శైలేష్.

శైలేష్ మాట్లాడుతూ... ‘‘నిజంగానే స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ అనేది దేశంలో చాలా పెద్ద సమస్యగా తయారయ్యింది. వేలల్లో పిల్లలకు ఈ సమస్య ఉందని బయటపడుతోంది. డాక్టర్లు కూడా దీని గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటారు. గతంలో ఏం జరుగుతుందో తెలియకుండా చనిపోయేవారు. కానీ ఇప్పుడు సమస్య గురించి బయటపడుతోంది. దానికి ఒక జీన్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఈ సమస్య ఉన్న పిల్లలు శరీరంలో ఒక జీన్ లేకుండా పుడతారు. దాని వల్ల శరీరంలో ఒకొక్క అవయవం ఫెయిల్ అయ్యి చనిపోతూ ఉంటారు. చాలా చిన్న వయసులో వాళ్లకి ఈ జీన్‌ రిప్లేస్‌మెంట్ ఇస్తే వాళ్లు కోలుకొని ఎక్కువకాలం బ్రతుకుతారు. దీనికి ఉపయోగపడే ఇంజెక్షన్‌‌కు 2 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ.17 కోట్లు’’ అంటూ చెప్పారు.

అలాగే ‘‘అంత ఖరీదైన  ఇంజెక్షన్‌ను అందరూ కొనగలరా లేదా అన్నదానికి సంబంధం లేకుండా దానికి ఒక రేటును ఫిక్స్ చేశారు. సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. రూ.17 కోట్ల ఇంజెక్షన్ గురించి డబ్బులు సేకరిస్తున్నామని చెప్తుంటారు. అవన్నీ ఈ ఇంజెక్షన్ గురించే. నిజంగానే దేశంలో జరుగుతున్న సమస్య ఇది. నేను కథలో ఆ సమస్యను తీసుకొని.. దాని చుట్టూ ఒక డ్రామాను క్రియేట్ చేశాను’’ అని చెప్పాడు శైలేష్.  

ఇక ‘‘కోవిడ్ సమయంలో దీని గురించి సాయం కావాలని నా దగ్గరకు వచ్చాడు. అప్పటినుండి ఈ సమస్య గురించి రీసెర్చ్ చేయడం ప్రారంభించాను. పిల్లల ఆరోగ్య సమస్యకు మందు లేకుండా చనిపోతున్నారంటే తల్లిదండ్రులుగా యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్లిపోవచ్చు. కానీ మన దగ్గర రూ.17 కోట్లు ఉంటేనే మన పిల్లలను కాపాడుకోగలము అంటే అది చాలా బాధాకరం. ఆ బాధను ఒక తండ్రి పాత్రలో వెంకటేశ్‌ను చూపిస్తే.. అందరూ బాగా కనెక్ట్ అవుతారు అనుకొని నేను సినిమా తీశాను’’ అని ‘సైంధవ్’కు వెంకటేశ్‌ను హీరోగా ఎంపిక చేసుకోవడానికి కారణాన్ని తెలిపాడు దర్శకుడు శైలేష్ కొలను.