కాశీలో మణికర్ణికను ప్రకటించనున్న క్రిష్
- ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో సినిమా
- మణికర్ణిక పేరుతో రానున్న సినిమాకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్
- బాహుబలి సినిమా బ్లాక్ బస్టర్ తో విజయేంద్ర ప్రసాద్, గౌతమి పుత్ర శాతకర్ణి సక్సెస్ తో క్రిష్ జోష్
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో అద్భుత విజయాన్ని అందుకున్న డైరెక్టర్ క్రిష్.. ప్రస్తుతం తన తర్వాతి సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. వీరనారి ఝాన్సీలక్ష్మీబాయ్ జీవిత కథ ఆధారంగా మణికర్ణిక పేరుతో సినిమా రూపొందించనున్నాడు. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్న రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించారు. ఈ సినిమాలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించనుంది.
చాలా రోజులుగా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుపుకున్న ఈ సినిమాను గురువారం సాయంత్రం కాశీ వేదికగా ప్రకటించనున్నారు. సాయంత్రం ధశాశ్వమేథ్ ఘాట్లో జరుగనున్న గంగా హారతి కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొననుంది. అందుకోసమే క్రిష్, కంగనతో పాటు కీలక సభ్యులు కాశీకి చేరుకున్నారు. మరాఠా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఝాన్సీ లక్ష్మీబాయ్ కాశీలోనే జన్మించింది. అందుకే గురువారం సాయంత్రం ప్రెస్మీట్ ఏర్పాటు చేసి ఈ సినిమా గురించి కాశీలోనే ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీబాయ్ గెటప్లో ఉన్న కంగన 20 అడుగుల పోస్టర్ను విడుదల చేయనున్నారు.