చిరంజీవి, రామ్చరణ్ కలిసి నటించిన `ఆచార్య` చిత్రం ఈ నెలలో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివ సినిమా రీషూట్లపై స్పందించారు. సూపర్ కౌంటర్ ఇచ్చారు.
దర్శకుడు కొరటాల శివ(Koratala Siva).. ఫెయిల్యూర్ లేని దర్శకుడు. ఆయన రూపొందించిన చిత్రాలు ట్రెండ్ సెట్టర్స్. మినిమమ్ గ్యారంటీ దర్శకుడిగా టాలీవుడ్లో పేరుతెచ్చుకున్నారు. `మిర్చి`, `శ్రీమంతుడు`, `జనతా గ్యారేజ్`, `భరత్ అనే నేను` వంటి చిత్రాలే అందుకు నిదర్శనం. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో `ఆచార్య`(Acharya) చిత్రం చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 29న విడుదల కాబోతుంది.
దర్శకుడు కొరటాల శివ చిత్రమంటే ఆయన సినిమాలో మంచి సందేశం, ఆలోచించపచేసే విషయాలుంటాయి. సామాజిక సందేశానికి కమర్షియల్ హంగులు జోడించి రూపొందించడం, దాన్ని హిట్ కొట్టడం ఆయన బలం. దర్శకుల్లో చాలా అరుదైన క్వాలిటీ ఇది. అందుకే కొరటాల దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. ఆయనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే ఆయనకు సంబంధించిన `ఆచార్య` సినిమా విషయంలో రీషూట్లు చేశారనే కామెంట్లు వినిపించాయి. ఆ మధ్య `ఆచార్య` రీషూట్ అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
కరోనా లాక్డౌన్ టైమ్లో `ఆచార్య`ని చాలా వరకు రిపేర్ చేశారని వార్తలొచ్చాయి. తాజాగా కొరటాల శివకి `ఆచార్య` రీషూట్(Acharya Re shoot) అనే వార్తలపై స్పందించారు. తాము అలాంటి రీషూట్లు చేయలేదని స్పష్టం చేశారు. అయితే రీషూట్లు చేస్తే తప్పేంటి అంటూ తనదైన స్టయిల్లో కౌంటర్లిచ్చారు. రీషూట్ చేయడం పట్ల అందరు తప్పుడు భావనతో ఉన్నారని తెలిపారు. తాము అనుకున్న సీన్ అనుకున్నట్టు రాకపోతే రీషూట్ చేయడంలో తప్పేముంది అని ప్రశ్నించారు.
రీషూట్ అంటే ఓ సీన్ని ఆడియెన్స్ కి ఆకట్టుకునేలా తీయడమే అని చెప్పారు. బాగ రాని సీన్ని అలా వదిలేయలేమని, వాటిని మరింత బెటర్గా తీసేందుకు రీషూట్లు చేయాల్సి వస్తుందని, ఏదైనా బెస్ట్ అవుట్పుట్ కోసమే అని తెలిపారు. సినిమాని నమ్మి ఆడియెన్స్ వస్తారని, వారికి అన్యాయం చేయలేమని, అందుకే రీషూట్లు చేస్తుంటారని తెలిపారు. ఒక సీన్ బాగా వచ్చేందుకు ఎన్నిసార్లయినా తీయొచ్చని చెప్పారు. ఆడియెన్కి సీన్ నచ్చేలా తీయడమే దర్శకుడి పని అని ఫైనల్ టచ్ ఇచ్చారు కొరటాల.
`ఆచార్య` సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని చాలా రోజులవుతుంది. అయితే `అఖండ`, `పుష్ప` చిత్రాల అనంతరం ఈ చిత్రంలోని కొన్ని సీన్లని రీ షూట్ చేశారని వార్తలొచ్చాయి. బీజీఎం, ఎలివేషన్ సీన్ల విషయంలో మరింత కేర్ తీసుకున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు కొరటాల వివరణ ఇవ్వడం విశేషం. ఇక ఈ చిత్రంలో చిరంజీవి, రామ్చరణ్ హీరోలుగా నటించారు. చిరుకి జోడీగా కాజల్, చరణ్కి జంటగా పూజా హెగ్డే నటించారు. `సైరా` తర్వాత చిరంజీవి నుంచి వస్తోన్న సినిమా కావడంతో దీనిపై మెగాఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి.
