చిరంజీవితో గొడవలపై క్లారిటీ ఇచ్చిన జీవితా రాజశేఖర్.. రజనీకాంత్ తరహా పాత్రలొస్తే విలన్గా ఓకే
మెగాస్టార్ చిరంజీవి, రాజశేఖర్ కు మధ్య గతంలో పలు వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. తాజాగా ‘శేఖర్’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జీవితా రాజశేఖర్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవితో గొడవలపై క్లారిటీ ఇచ్చారు. అలాగే సినిమా వివరాలను కూడా తెలియజేశారు.
దర్శకురాలు జీవిత రాజశేఖర్ డైరెక్షన్ లో, డాక్టర్ రాజశేఖర్ హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘శేఖర్’ (Shekar). వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. మే 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తోంది.
చిత్ర విడుదల సందర్భంగా దర్శకురాలు జీవితా రాజశేఖర్ తాజాగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్థావన రావడంతో జీవితా రాజేశేఖర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ ‘మాకు ఎవరితోనూ ఏ ఇష్యూ లేదు. కానీ చిరంజీవితో ఎప్పుడో గతంతో జరిగిన విషయాన్ని రిపీట్ చేస్తూ..యూట్యూబ్ వారే థంబ్ నెల్స్ పెట్టి మా మధ్య ఇంకా దూరాన్ని పెంచుతున్నారు. దయచేసి ఇలాంటి కార్యక్రమాలను ఆపాలని కోరుతున్నాను’ అని తెలిపింది.
అయితే, 2020లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నిర్వహించిన మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో చిరు, రాజశేఖర్ మధ్య జరిగిన వివాదం అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమంలో ‘మా’లోని సమస్యలను బహిర్గతంగా రాజశేఖర్ వెల్లడించడం పట్ల చిరంజీవి ఫైర్ అయ్యారు. అలాగే ముఖ్య అథితులుగా హాజరైన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రెబల్ స్టార్ కృష్ణం రాజులు కూడా తప్పుబట్టారు. అప్పటి ఇష్యూనే ఇంకా కొనసాగుతున్నదనే నేపథ్యంలో తాజాగా జీవితా రాజశేఖర్ ఇలా స్పందించారు. అలాగే ‘మా’ లో తను లేకపోయినా అందరూ టచ్ లోనే ఉన్నారని తెలిపింది. ఎవరికీ ఏ హెల్ప్ కావాలన్నా తప్పకుండా ముందుంటానని హామీనిచ్చారు.
అలాగే రాజశేఖర్ నెగిటివ్ రోల్స్ పైనా క్లారిటీ ఇచ్చారు. ‘ఇదే విషయాన్ని అందరూ అడుగు తున్నారు. మొదట తన జర్నీ విలన్ గానే మొదలైంది. భారతి రాజా దర్శకత్వంలో విలన్ గా నటించాడు. తరువాత హీరోగా బిజీ అయ్యాడు. అయితే రామ్ చరణ్ సినిమా "ధ్రువ" లోని అరవిందస్వామి లాంటి క్యారెక్టర్, పెదరాయుడు లోని రజినీకాంత్ వంటి అన్ టచబుల్ క్యారెక్టర్ వస్తే కచ్చితంగా చేస్తాడు. అలాగే చిరంజీవి ఆఫర్ ఇచ్చినా చేయడానికి తను సిద్ధంగా ఉన్నారు.’ అని వివరించింది.
ఇక ‘శేఖర్’ సినిమా విషయానికొస్తే.. హీరోగా డాక్టర్ రాజశేఖర్, హీరోయిన్ గా ఆత్మీయ రాజన్ నటించారు. ప్రకాష్ రాజ్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర పలు పాత్రలను పోషించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘జోసెఫ్’ సినిమా తెలుగు రీమేక్ గా ‘శేఖర్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రాజశేఖర్ డాటర్ శివాని కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది.