గద్దర్ అవార్డులు గ్రాండ్గా సక్సెస్ అయ్యాయని నిర్మాత దిల్ రాజు తెలిపారు. అదే సమయంలో అవార్డుకి ఎంపికై తీసుకోవడానికి రాని వారికి ఆయన వార్నింగ్ ఇచ్చారు.
స్టార్ హీరోలకు, దర్శక, నిర్మాతలకు తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మెన్ దిల్ రాజు వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం అవార్డులు ఇస్తే జాగ్రత్తగా వచ్చి తీసుకోవాలని తెలిపారు. గద్దర్ అవార్డులకు రాని హీరోలకు ఆయన పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.
సినిమాల షూటింగ్ల్లో ఉన్నా, ప్రభుత్వం గుర్తించి అవార్డు ఇచ్చినప్పుడు షూటింగ్లు పక్కన పెట్టి రావాల్సిందే అన్నారు. మున్ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అవార్డులు ఇస్తుంది, అక్కడికి కూడా అవార్డుకి ఎంపికైన వాళ్లు కచ్చితంగా వెళ్లాలి అని తెలిపారు దిల్రాజు.
గ్రాండ్గా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుక
దాదాపు 14ఏళ్లుగా ఆగిపోయిన నంది అవార్డుల స్థానంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో అవార్డులను అందించిన విషయం తెలిసిందే. శనివారం(జూన్ 14) సాయంత్రం ఈ అవార్డుల ప్రధానోత్సవ వేడుక ఘనంగా జరిగింది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హాజరై అవార్డులను అందించారు. వీరితోపాటు చిత్ర పరిశ్రమ నుంచి బాలకృష్ణ, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ,
అలాగే రాజమౌళి, సుకుమార్, వినాయక్, గుణశేఖర్, క్రిష్, నాగ్ అశ్విన్, వెంకీ అట్లూరి, దశరథ్, సుహాసిని, జయసుధ, జయప్రద, మురళీ మోహన్ వంటి వారితోపాటు అవార్డులు వచ్చిన నటీనటులు, దర్శక, నిర్మాతలు, ఇతర సాంకేతిక నిపుణులు హాజరై గద్దర్ అవార్డులను అందుకున్నారు.
రెండు గంటలు వేడుకలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి
దీనిపై ఎఫ్డీసీ ఛైర్మెన్, నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, గద్దర్ అవార్డుల వేడుక బాగా సక్సెస్ అయ్యిందని తెలిపారు. దాదాపు ఆరు నెలలుగా దీనికోసం ప్లాన్ చేస్తున్నామని, దాని వల్లే అంత బాగా చేయగలిగామని తెలిపారు.
అదే సమయంలో గద్దర్ అవార్డుల విధివిధానాలు ఎలా ఉండాలనేది కమిటీ వేసి ఒక పాలసీని తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈవెంట్ని సక్సెస్ చేయడానికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు దిల్ రాజు.
ఈ ఈవెంట్కి సీఎం రేవంత్ రెడ్డి రెండు గంటల టైమ్ ఇచ్చారని, అంత సమయం ఇవ్వడం గొప్ప విషయమన్నారు. నిజానికి ఆయన గంటసేపే ఉండాలి, కానీ తాను రిక్వెస్ట్ చేయడం వల్ల మరో గంట ఉండి, చాలా వరకు ఆయన అవార్డులను అందించినట్టు తెలిపారు.
గద్దర్ అవార్డుల వేడుకకి రాని వారికి దిల్ రాజు వార్నింగ్
ఈ అవార్డుల వేడుకపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారని, ప్రభుత్వ వర్గాల నుంచి, ఇతరుల నుంచి కూడా మంచి రివ్యూస్ వచ్చాయని, మీడియా కూడా బాగా సపోర్ట్ చేశారని తెలిపారు.
అయితే ప్రభుత్వం సినిమా పరిశ్రమని ప్రోత్సహిస్తూ అవార్డులు ఇచ్చినప్పుడు దానికి ఎంపికైన ప్రతి ఒక్కరు వచ్చి జాగ్రత్తగా అవార్డులు తీసుకోవాలని తెలిపారు. ఇప్పుడు రాకపోయినా, నెక్ట్స్ ఆంధ్రప్రదేశ్లో అవార్డులు ఉంటాయి వాటికైనా కచ్చితంగా హాజరు కావాలని, అది మన బాధ్యత అని తెలిపారు.
ప్రభుత్వం అవార్డు ఇస్తే కచ్చితంగా రావాల్సిందే
అవార్డులు అంటే ప్రభుత్వంతో మనం చేసే జర్నీ, అది మంచిగా ఉండాలని గద్దర్ అవార్డులకు రాని వారికి చురకలు అంటించారు దిల్ రాజు. వచ్చే సారి అయినా ఇలాంటి అవార్డులు వస్తున్నప్పుడు, అందులో మీకు అవార్డు వస్తుందన్నప్పుడు ఆ డేట్ని మార్క్ చేసుకుని కచ్చితంగా హాజరయ్యే ప్రయత్నం చేస్తారని భావిస్తున్నట్టు తెలిపారు.
దీన్ని అందరు అర్థం చేసుకోవాలని అనుకుంటున్నా అని చెప్పారు దిల్ రాజు. గద్దర్ అవార్డుల వేడుకకి చాలా మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు రాలేదు. తమ సినిమాలకు అవార్డులు వచ్చినా, వారు అటెండ్ కాలేదు. ఈ నేపథ్యంలో దిల్ రాజు వారికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారని చెప్పొచ్చు.


