దిల్ రాజు బ్యానర్లో ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ చిత్రాలు... అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన స్టార్ ప్రొడ్యూసర్!
దిల్ రాజు తాజా ఇంటర్వ్యూలో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై కీలక అప్డేట్స్ ఇచ్చారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ తో ప్రాజెక్ట్స్ ఫైనల్ అయ్యాయంటూ క్రేజీ న్యూస్ పంచుకున్నారు.
![dil raju conforms movies with prabhas ntr and pawan kalyan ksr dil raju conforms movies with prabhas ntr and pawan kalyan ksr](https://static-ai.asianetnews.com/images/01gqs6dw76sx5s6104dm2wkypf/dil-raju-jpg_363x203xt.jpg)
కిందపడ్డా మీదపడ్డా దిల్ రాజుకు పరిశ్రమలో తిరుగులేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన నంబర్ వన్ ప్రొడ్యూసర్ హోదా నిలబెట్టుకుంటున్నారు. బలగం మూవీతో అభిరుచి ఉన్న నిర్మాతగా మరోసారి నిరూపించుకున్నారు. అయితే శాకుంతలం మూవీతో ఊహించని దెబ్బతిన్నారు. గుణశేఖర్ ప్రాజెక్ట్ లో అడుగుపెట్టి భారీగా నష్టపోయారు. నా 25 ఏళ్ల కెరీర్లో శాకుంతలం ఊహించని పరిణామం అంటూ ఫెయిల్యూర్ పై నేరుగా మాట్లాడారు.
కాగా ఎన్టీఆర్, ప్రభాస్ లతో దిల్ రాజు సినిమా చేసి చాలా కాలం అవుతుంది. ప్రభాస్ తో మిస్టర్ పర్ఫెక్ట్, ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్యా ఆయన చివరి చిత్రాలు. ఈ క్రమంలో వీరితో మీకు గ్యాప్ వచ్చినట్లు ఉంది. ఎన్టీఆర్, ప్రభాస్ లతో ఎప్పుడు సినిమాలు చేస్తున్నారని అడగ్గా... ప్రభాస్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఒకటి నిర్మిస్తున్నాను. దాదాపు ఇది ఫైనల్ అయ్యింది. అలాగే ఎన్టీఆర్ తో ఒక మూవీకి ఒప్పందం చేసుకున్నాను. ఇది కూడా ఖచ్చితంగా ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ తో మరొక చిత్రం చేయబోతున్నాను... అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు.
ఈ మూడు ప్రాజెక్ట్స్ ఫైనల్ అయితే దిల్ రాజు దాదాపు రూ. వెయ్యి కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు లెక్క. ఎన్టీఆర్, ప్రభాస్ పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. యావరేజ్ బడ్జెట్ రూ. 300 కోట్లు ఉంటుంది. పవన్ మూవీ కూడా ఓ రెండు వందల కోట్లకు తక్కువ ఉండదు. కాబట్టి దిల్ రాజు బ్యానర్లో భవిష్యత్తులో మనం ఊహించని చిత్రాలు విడుదల కానున్నాయి.
ఆల్రెడీ రామ్ చరణ్ తో చేస్తున్న గేమ్ ఛేంజర్ భారీ ప్రాజెక్ట్. దర్శకుడు శంకర్ చాలా ఉన్నతంగా తెరకెక్కిస్తున్నారు. సాంగ్స్, ఫైట్స్ కాంప్రమైజ్ కాకుండా రూపొందిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్లో 50వ చిత్రంగా గేమ్ ఛేంజర్ తెరకెక్కుతుంది. కియారా అద్వానీ హీరోయిన్. పొలిటికల్ థ్రిల్లర్ కాగా రామ్ చరణ్ రెండు భిన్నమైన రోల్స్ చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.