భారీ అంచనాలతో గురువారం విడుదలౌతున్న జై లవ కుశ బెన్ ఫిట్ షో వేయాలని కోరుతున్న ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటి వరకు పర్మిషన్లు ఇవ్వని పోలీసులు

భారీ అంచనాల నడుమ గురువారం విడుదల కాబోతున్న జై లవ కుశ చిత్రానికి పెద్ద చిక్కు వచ్చి పడింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులంతా టెన్షన్ పడుతున్నారు. వీరందరినీ టెన్షన్ పెడుతోంది ఎవరో కాదు హైదరాబాద్ పోలీసులు.

అసలు విషయానికి వస్తే... సాదారణంగా పెద్ద హీరోల సినిమాల‌కు బెనిఫిట్ షోలు ప‌డ‌డం స‌హ‌జం. అయితే ఈమ‌ధ్య హైద‌రాబాద్ పోలీసులు అందుకు సంబంధించిన ప‌ర్మిష‌న్లు ఇవ్వ‌డం లేదు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కాట‌మ‌రాయుడు నుంచి నిన్న‌టి పైసా వ‌సూల్ వ‌ర‌కూ ఈ స‌మస్యే ఎదురైంది. ఇప్పుడు తారక్ జై లవ కుశకి కూడా ఈ సమస్యే తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ఎన్టీఆర్ మొట్ట మొదటి సారిగా త్రిపాత్రాభిన‌యం చేసిన సినిమా జై ల‌వ‌కుశ‌. ఈ సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుండగా.. బుధ‌వారం అర్థ‌రాత్రి ఎలాగైనా స‌రే.. ఫ్యాన్స్ షో వేయాలని ఎన్టీఆర్ అభిమానులు కోరుతున్నారు.

ఇక నైజాం ఏరియా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో దిల్ రాజు తల్చుకుంటే కానిదంటూ లేదని టాక్ ఉన్నప్పటికీ..ఈసారి ల‌వ‌కుశ‌కు మాత్రం క‌ష్ట‌మ‌వుతోంది. దీనికి కారణం డీసీపీ సెల‌వులో ఉండ‌డం, ఇన్ ఛార్జ్ డీసీపీ ఎటూ తేల్చ‌క‌పోవ‌డం.

కాకపోతే హైద‌రాబాద్ బ్ర‌మ‌రాంబ‌ థియేటర్లో తెల్ల‌వారుఝామున 3 గంట‌ల‌కు ఫ్యాన్స్ షో వేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. టికెట్లు కూడా అమ్మేశారు. మరి ఇప్పటి వరకు ఎలాంటి పర్మిషన్ రాకపోవడంపై ఉత్కంఠ కొనసాగుతోంది.