దళిత బంధు డబ్బులతో సినిమా.. కలెక్టర్ చేతుల మీదుగా పోస్టర్ లాంచ్..
దళిత బంధు డబ్బులతో కారు కొనుక్కోవడమో, షాప్ పెట్టుకోవడమో, బిజినెస్ చేయడమో చేస్తుంటారు. కానీ ఓ ఫిల్మ్ మేకర్.. ఏకంగా సినిమా తీశాడు. ఇదిప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.

దళిత బంధు డబ్బులతో కారు కొనుక్కోవడమో, షాప్ పెట్టుకోవడమో, బిజినెస్ చేయడమో చేస్తుంటారు. ఇతర అవసరాలకు వాడుకుంటారు. కానీ ఓ ఫిల్మ్ మేకర్.. భిన్నంగా ఆలోచించాడు. ఏకంగా సినిమా తీశాడు. సినిమాపై తనకున్న ప్యాషన్ని చాటి చెప్పాడు ఓ ఫిల్మ్ మేకర్. దళితబంధు ద్వార వచ్చిన డబ్బులతో సినిమా తీయడం విశేషం. అయితే తాను రూపొందించిన సినిమాకి సంబంధించిన పోస్టర్ని ఏకంగా కలెక్టర్ చేతుల మీదుగా లాంచ్ చేయడం మరో విశేషం. ఆ వివరాలు చూస్తే.. నల్గొండలో నివాసం ఉండే గౌతమ్ కృష్ణ స్వస్థలం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన వీణవంక గ్రామం వాసి.
ప్రస్తుతం నల్గొండ కలెక్టర్ ఏవీ కర్నన్.. కరీంనగర్ కలెక్టర్గా ఉన్న సమయంలో గౌతమ్ కృష్ణకి దళిత బంధు వచ్చింది. అయితే ఆయనకు సినిమా అంటే పిచ్చి. ఆయన వద్ద మంచి కథలున్నాయి. కానీ వాటిని సినిమాగా తీసేందుకు డబ్బులు లేవు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఎలాగైనా సినిమా తీయాలనే తపన తనలో ఉంది. అప్పుడే ప్రభుత్వం దళిత బంధు ఇచ్చింది. దాన్నే పెట్టుబడిగా పెట్టాడు గౌతమ్ కృష్ణ.
దళిత బంధు ద్వారా వచ్చిన డబ్బులతో `అమ్మ ప్రొడక్షన్` పేరుతో నిర్మాణ సంస్థని ప్రారంభించాడు. `ది కాప్` పేరుతో సినిమా రూపొందించారు. ఈ పోస్టర్ ని నల్గొండ కలెక్టర్ ఏవీ కర్నన్ లాంఛ్ చేశాడు. 1100 మంది లబ్ది దారులను దళిత బంధు ప్రక్రియ నిర్వహించి అవగాహన శిభిరాన్ని నిర్మించారు. దళిత బంధు ద్వారా వచ్చిన డబ్బుని ఎలా సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలో తెలిపారు. ఈ సందర్భంగా `ది కాప్` మూవీ పెద్ద విజయం సాధించాలని కోరుకున్నారు.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత గౌతం కృష్ణ మాట్లాడుతూ, కర్ణన్ కరీంనగర్ కలెక్టర్గా ఉన్నప్పుడు తాను దళితబంధుని స్వీకరించానని, ఆ నిధులను తన అభిరుచికి వినియోగించినట్టు చెప్పారు. `ది కాప్` పేరుతో సినిమాని తెరకెక్కించానని, ఇందులో సుమన్ మెయిన్ లీడ్గా చేస్తున్నాని తెలిపారు. ఈ పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఇక పోస్టర్లో గన్కి వైట్ క్లాత్ చుట్టి ఉండటం, అది ఎగిరిపోతుండగా, దానికి కొన్ని రక్తం మరకలున్నాయి. పోస్టర్ ఆకట్టుకుంటుంది.